ఆధునికీకరణ పనులపై మంత్రి సమీక్ష
ఆధునికీకరణ పనులపై మంత్రి సమీక్ష
- రాయలసీమ సాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి
- గేట్ల మార్పిడి పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి
- రైతులకు నిరంతర నీటి సరఫరా లక్ష్యంగా చర్యలు
తుంగభద్ర, మార్చి 31 (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కర్ణాటకలోని ప్రముఖ జలాశయం తుంగభద్ర డ్యామ్ ను సందర్శించారు. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి కీలకంగా సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ వద్ద జరుగుతున్న పనులను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.
డ్యామ్ వద్ద ప్రస్తుతం నూతనంగా అమర్చుతున్న గేట్ల పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చే ప్రక్రియను అధికారులు వివరించగా, పనుల నాణ్యత, భద్రతా ప్రమాణాలపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా తుంగభద్ర డ్యామ్ సమీపంలోని వైకుంఠం గెస్ట్ హౌస్లో అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. గేట్ల ఆధునికీకరణ పనుల పురోగతి, భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలపై అధికారులు ఇచ్చిన వివరాలను ఆయన తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు.
రాయలసీమ ప్రాంత రైతులకు సాగునీరు నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నీటి కొరత సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒకే సీజన్లో పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చడం రికార్డు స్థాయిలో జరుగుతోందని తెలిపారు. తమ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు ఈ పనులే నిదర్శనమని పేర్కొన్నారు.
రాయలసీమ రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు.
