మూసీ నది శుద్ధిపై ముఖ్యమంత్రి సంకల్పం
మూసీ నది శుద్ధిపై ముఖ్యమంత్రి సంకల్పం
- మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వ దీక్ష.. చారిత్రక పుణ్యక్షేత్రాల పునర్నిర్మాణానికి శ్రీకారం
- పురాతన ఆలయాల అభివృద్ధికి భారీ ప్రణాళికలు
- పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా మారనున్న పరీవాహక ప్రాంతం
హైదరాబాద్, మార్చి 28 (పీపుల్స్ మోటివేషన్): ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మానవ తప్పిదాల వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం కనుమరుగయ్యే ప్రమాదం నుంచి కాపాడి, భవిష్యత్తు తరాలకు అత్యద్భుత నగరాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మూసీ నది శుద్ధి ప్రస్తుతం అత్యవసరమైన అంశమని, దీనిపై ఎలాంటి రాజీ ఉండదని అన్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా గండిపేట-మంచిరేవుల ప్రాంతంలోని చారిత్రక వీరభద్రస్వామి ప్రాంగణంలో శ్రీ మచిలేశ్వర స్వామి, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోవు పూజ చేసి గోశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయాల అభివృద్ధికి సంబంధించిన పూజలు, శంకుస్థాపనలు ఘనంగా జరిగాయి.
సుమారు 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దాదాపు 8 ఎకరాల్లో రూ.700 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనతో పాటు ఈ ప్రాంతాన్ని ధ్యానమందిరాలు, సాంస్కృతిక కట్టడాలతో ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళనను ఏ పరిస్థితుల్లోనూ ఆపబోమని, ఇది ప్రభుత్వ దీక్ష అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రామప్ప ఆలయ నమూనాలో నిర్మాణాలు చేపట్టాలని సంకల్పించామని, ఇది యాదృచ్ఛికంగా కాకుండా దైవ సంకల్పంతో జరుగుతున్న కార్యక్రమమని అన్నారు.
నదీ పరీవాహక ప్రాంతాలు అభివృద్ధికి కేంద్రబిందువులుగా మారుతాయని చరిత్ర చెబుతోందని, తెలంగాణకు సముద్రతీరం లేకపోయినా నదులను సమర్థంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది కాలుష్యం వల్ల ఏర్పడిన సమస్యలను ఉదాహరణగా తీసుకుని, హైదరాబాద్లో అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మూసీ ప్రక్షాళనతో పాటు నగరంలో మత సామరస్యాన్ని ప్రతిబింబించే నిర్మాణాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. చార్మినార్ ప్రాంతంలో మసీదు, గౌలిగూడలో సిక్కు దేవాలయం, ఉప్పల్ ప్రాంతంలో చర్చి నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. గోదావరి నుంచి నీటి సరఫరా ద్వారా నగర అవసరాలను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
