పర్యాటక రంగానికి వేగం పెంచుతున్న మంత్రి
పర్యాటక రంగానికి వేగం పెంచుతున్న మంత్రి
- ఢిల్లీలో కేంద్ర మంత్రితో కీలక భేటీ
- రూ.915 కోట్ల ప్రాజెక్టులకు ప్రతిపాదనలు
- ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకంపై దృష్టి
ఢిల్లీ, ఏప్రిల్ 2 (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఢిల్లీలో పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ శేఖావత్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన ఆమోదించాలని మంత్రి కోరారు. అలాగే రూ.915 కోట్ల విలువైన తొమ్మిది కొత్త పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని వివరించారు.
స్వదేశ్ దర్శన్ 2.0, ప్రసాద్ వంటి పథకాల ద్వారా ఐకానిక్ పర్యాటక కేంద్రాల అభివృద్ధి, ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ల బలోపేతంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పథకాల ద్వారా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రతిపాదించారు.
మచిలీపట్నం బీచ్ ఫ్రంట్ అభివృద్ధి, మంగళగిరి, అరసవల్లి, కోరుకొండ, వాడపల్లి వంటి ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి కేంద్ర సహకారం కోరారు. అలాగే లేపాక్షి, లంబసింగి, బౌద్ధ క్షేత్రాలలో పర్యాటక సౌకర్యాల విస్తరణకు అవసరమైన చర్యలను వివరించారు.
అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ స్థాపన, పర్యాటక భవన్ నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులపై కూడా మంత్రి చర్చించారు. అదనంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటు ద్వారా తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రతిపాదించారు.
కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లభించిందని మంత్రి తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ.430 కోట్ల ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
.jpg)