Elections: దేశంలో మరోసారి మోగిన ఎన్నికల నగారా.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే
Elections: దేశంలో మరోసారి మోగిన ఎన్నికల నగారా.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే
Elections: దేశంలో మరోసారి ఎన్నికల నగారా (Elections) మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
మహారాష్ట్ర (Maharashtra)లో.. మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకోసం అక్టోబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 29వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 4 వరకు గడువు ఉంటుంది. ఇక నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించి.. 23న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఈసీ వివరించింది. రాష్ట్రంలో మొత్తం 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉండగా.. లక్షా 186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాగా, నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది.
మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్..
అక్టోబర్ 22న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్
అక్టోబర్ 29 వరకు నామినేషన్ల స్వీకరణ
నవంబర్ 4 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
నవంబర్ 20న పోలింగ్
నవంబర్ 23న ఓట్ల లెక్కింపు
మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు (Jharkhand Assembly Elections) కూడా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. జార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గానూ రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 43 స్థానాలకు నవంబర్ 13న ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిని 38 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు ఉంటాయి. ఇక నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 29,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. ఇక వచ్చే ఏడాది జనవరి 5తో జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది.
ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్..
అక్టోబర్ 18న మొదటి దశ, అక్టోబర్ 22న రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్
అక్టోబర్ 25 వరకు మొదటి దశ, అక్టోబర్ 29 వరకు రెండో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
అక్టోబర్ 30 వరకు మొదటి దశ, నవంబర్ 1 వరకు రెండో దశ నామినేషన్ల ఉపసంహరణకు గడువు
నవంబర్ 13న మొదటి దశ, నవంబర్ 20న రెండో దశ పోలింగ్
నవంబర్ 23న ఓట్ల లెక్కింపు
ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar ) మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ మొత్తం వెబ్కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు సీ విజిల్ యాప్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. మద్యం, డ్రగ్స్, కానుకలు పంపిణీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆన్లైన్ వాలెట్లపైనా నిఘా ఉంటుందని.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై నిఘా పెడుతున్నట్లు సీఈసీ తెలిపారు.
మరోవైపు జమ్ము కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కూడా సీఈసీ రాజీవ్ కమార్ మాట్లాడారు. ‘జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాం. కశ్మీర్ ఎన్నికల నిర్వహణపై ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందాయి. ఉగ్రదాడులకు భయపడకుండా ప్రజలు ఓటేశారు. హింసాత్మక ఘటనలు ఒక్కటీ జరగకుండా ఎన్నికలు నిర్వహించాం. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించినా కొందరు విమర్శలు చేస్తున్నారు’ అని అన్నారు.