Ration Cards: గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రజలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు
Ration Cards: గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రజలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు
• గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన ధాన్యం బకాయి చెల్లింపు..
• ప్రస్తుతం ఏపీలో 1.48 కోట్ల రేషన్ కార్డులు..
• 6000ల రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ..
• 4,000 పైగా కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు..
• మార్పులు, చేర్పులతో పాటు అర్హులందరికీ అందిస్తామన్న ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. అర్హులైన పేదలకు త్వరలో నూతన రేషన్ కార్డులు ఇచ్చేందుకు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల మార్పులు, చేర్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ లోనీ కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలన సందర్భంగా కొత్తగా రేషన్ కార్డుల జారీ, పౌర సరఫరాల శాఖలో ఇతర సమస్యల పరిష్కారాన్ని ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది.
గత ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్లో పెట్టిన ధాన్యం బకాయిలు రూ.1,674.40 కోట్ల మొత్తాన్ని కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే తొలి విడతగా రూ.1000 కోట్లు, తర్వాత రెండో విడతగా రూ.674.40 కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేసింది. ఏపీలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో 89 లక్షలకు ఆహార భద్రత చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందిస్తోంది. మిగిలిన కార్డులకు రేషన్ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
6000ల రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ..
వచ్చే క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. వాహనాల ద్వారా రేషన్ సరకుల పంపిణీ, 6000ల రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొత్తగా 4,000 పైగా దుకాణాలు ఏర్పాటు లాంటి వాటిపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000లు, పట్టణ ప్రాంతాల్లో రూ.12,000లకు మించితే, ఆ కుటుంబాలు రేషన్ కార్డుకు అర్హులు కావని గత సర్కార్ నిర్ణయించింది. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు, పొరుగు సేవల ఉద్యోగుల కార్డులు రద్దయ్యాయి. వారి కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యాయి. తమకు వచ్చేదే తక్కువ జీతమని, రేషన్ కార్డుల తొలగింపు వల్ల నష్టపోతున్నామని వారంతా ఆవేదనతో ఉన్నారు. కూటమి ప్రభుత్వమైనా కుటుంబ ఆదాయ పరిమితిని పెంచి, కొత్తగా కార్డులు జారీ చేయాలని వారు కోరుతున్నారు.
ఏం చేయాలనుకుంటున్నారు...
కూటమి ప్రభుత్వ కొత్త రేషన్ కార్డుల మంజూరు, కుటుంబాల విభజన, కుటుంబ సభ్యుల చేర్పులు, కుటుంబ సభ్యుల తొలగింపు, చిరునామా మార్పు, కార్డులను సరెండర్ చేయడం వంటి కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు.