Inter: రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
Inter: రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి (5వ తేదీ నుంచి) ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సుమారు పది లక్షల మంది విద్యార్థులు రాయనున్న ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. తొలిసారిగా హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దీని సాయంతో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.
అన్ని జిల్లా కేంద్రాలకు చేరిన ప్రశ్నాపత్రాలు..
రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. 29,992 మంది ఇన్విజిలేటర్లు, 72 ఫ్లయింగ్ స్క్వాడ్, 124 సిట్టింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రశ్నా పత్రాలు, ఆన్సర్ షీట్లు జిల్లా కేంద్రాలకు చేరాయని, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయం చేసుకుంటూ పరీక్షల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు.
గ్రేస్టైమ్ పీరియడ్..
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామన్న తెలిపారు. విద్యార్థులు హాల్ టిక్కెట్లను ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు 8.45 వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరిన కృష్ణ ఆదిత్య.. ఒకటి, రెండు నిమిషాలు ఆలస్యమైన వారిని సైతం అనుమతిస్తామని స్పష్టం చేశారు.
మార్చి 5న ప్రారంభమయ్యే జూనియర్ ఇంటర్ పరీక్షలు ఈనెల 24న ముగుస్తాయి. అలాగే, సీనియర్ ఇంటర్ పరీక్షలు మార్చి 6 నుంచి మొదలై ఈనెల 25 వరకు జరుగుతాయి.
