తోషిబా 562 కోట్ల కొత్త ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు ఒప్పందం
తోషిబా 562 కోట్ల కొత్త ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు ఒప్పందం
ప్రఖ్యాత తోషిబా కార్పొరేషన్ (Toshiba Corporation) అనుబంధ సంస్థ తెలంగాణలో కొత్తగా రూ.562 కోట్ల భారీ పెట్టుబడితో మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో భాగంగా ఈ భారీ పెట్టుబడిని రాబట్టింది.
జపాన్కు చెందిన మల్టీనేషన్ దిగ్గజం తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన, తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (టీటీడీఐ) (Toshiba Transmission & Distribution Systems (India) Pvt Ltd) రూ.562 కోట్లతో సంగారెడ్డి జిల్లా రుద్రారంలో కొత్త ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులను, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఒప్పందం ద్వారా ముందడుగు వేసింది.
టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో తోషిబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ హిరోషి కనెటా గారు, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్ గారు, టీటీడీఐ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి ఫురుటా గారు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఒప్పందం ప్రకారం సంగారెడ్డి జిల్లా రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. అదే విధంగా, పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్గేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు ఇప్పటికే ఉన్న ఫ్యాక్టరీలను ఆధునీకరించనుంది.
ఈ ప్రాజెక్టు కోసం తోషిబా సంస్థ రూ.562 కోట్ల పెట్టుబడి కేటాయించనుంది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించే ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్ను తీర్చడమే కాక, గణనీయమైన ఉద్యోగ అవకాశాలను సృష్టించనుంది.
రుద్రారంలో ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న టీటీడీఐ, ఈ కొత్త పెట్టుబడితో మూడవ ఫ్యాక్టరీని నెలకొల్పడంతో పాటు, ప్రస్తుత ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని విస్తరించనుంది.
ఈ ఒప్పందం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆర్థిక పరివర్తనలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని, పరిశ్రమల భాగస్వామ్యం, వ్యూహాత్మక సహకారాల ద్వారా ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని, తోషిబాతో ఈ ఒప్పందం పారిశ్రామిక రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అన్నారు.
టీటీడీఐ చైర్మన్ హిరోషి ఫురుటా గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు తమను ఆకర్షించాయని, ఆవిష్కరణల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధత తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చిందని, ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నామని తెలిపారు.