ఆరుగురు ప్రభుత్వ డాక్టర్లపై చర్యలకు ఆదేశం
ఆరుగురు ప్రభుత్వ డాక్టర్లపై చర్యలకు ఆదేశం
• తప్పుడు హాజరు, అక్రమ వైకల్య ధృవ పత్రాల జారీ, అవినీతి, విధుల పట్ల నిర్లక్ష్యానికి పాల్పడ్డారని ఆరోపణలు
• అవకతవకలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే
• సమగ్ర విచారణకు ఆదేశించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉంటూ దారితప్పి వ్యవహరించారన్న ఆరోపణలొచ్చిన ఆరుగురు ప్రభుత్వ వైద్యులపై సమగ్ర దర్యాప్తు జరిపి తగు క్రమశిక్షణా చర్యల్ని చేపట్టాలని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారంనాడు ఆదేశించారు. విధులకు హాజరు కాకుండా వచ్చినట్లు హాజరు రిజిస్టర్లో సంతకం చేయడం, సంవత్సరం పాటు అనుమతి లేకుండా విధులకు గైరు హాజరు కావడం, లంచాలు తీసుకుని తప్పుడు వైకల్య ధృవ పత్రాల్ని జారీ చేయడం మరియు విధుల పట్ల నిర్లక్ష్యం వహించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారన్న ఆరోపణలపై విచారణకు మంత్రి ఆదేశించారు. వీటిలో రెండు ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ప్రాథమిక విచారణ జరపడం గమనార్హం.
తప్పుడు హాజరు
గుడివాడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరా దేవి ఆసుపత్రికి రాకుండా హాజరు రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారంటూ ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదును డిఎస్హెచ్ ఉన్నతాధికారులు పరిశీలించారు. గతేడాది జనవరి-మార్చి కాలంలో పలు విడతల్లో 22 రోజులు డాక్టర్ ఇందిరా దేవి ఆసుపత్రికి రాలేదని నిర్ధారణయ్యింది. ఆయా రోజుల్లో ఆవిడ హాజరు రిజిస్టర్లో సంతకాలు చేశారు. దీంతో పాటు ముఖ ఆధారిత హాజరు విధానం(ఎఫ్ ఆర్ యస్) ద్వారా కూడా హాజరు నమోదు చేశారు. కానీ, ఎఫ్ ఆర్యస్ సాంకేతికత ద్వారా ఆయా రోజుల్లో సూపరింటెండెంట్ ఒక రోజు మచిలీపట్నంలోనూ, 8 రోజులు తణుకులో, మరో 13 రోజులు విశాఖపట్నంలో ఉన్నట్లు నిర్ధారణయ్యింది. డాక్టర్ ఇందిరాదేవి ఇచ్చిన వివరణ అసమంజసంగా ఉండటంతో నియమాల ప్రకారం తగు చర్యల్ని చేపట్టేందుకు మంత్రి ఆదేశించారు. దీంతో పాటు... హాజరు పర్యవేక్షణలో అలసత్వం వహించిన అప్పటి కృష్ణా జిల్లా డిసిహెచ్యస్ మరియు ఈ ఫిర్యాదుపై నామమాత్రపు విచారణ జరిపిన అప్పటి కృష్ణా జిల్లా డిఎంహెచ్వో పై కూడా తగు చర్యల్ని చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
దీర్ఘకాలిక అనధికార గైరు హాజరు
ప్రస్తుతం ఎమ్మెగనూరు ఏరియా ఆసుపత్రిలో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ సుధా అయ్యగారి ఫిబ్రవరి 2022 నుంచి ఏడాది పాటు తగు అనుమతులు తీసుకోకుండా విధులకు దూరంగా ఉన్నారు. దీనికి సంబంధించి హేతుబద్ధమైన కారణాలు చూపనందున తగు చర్యల్ని చేపట్టేందుకు మంత్రి విచారణకు ఆదేశించారు.
లంచాలు తీసుకుని తప్పుడు వైకల్య ధృవ పత్రాల జారీ
రూ.10,000 నుంచి రూ.25,000 వరకు లంచాలు తీసుకుని ఏలూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రిలోని సంబంధిత వైద్యులు తప్పుడు వైకల్య ధృవ ప్రతాల్ని జారీ చేశారన్న ఫిర్యాదుపై ఎసిబి విచారణ జరిపి 5 ధృవ పత్రాల జారీ అక్రమమని నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా... సివిల్ అసిస్టెంట్ సర్జన్లు డాక్టర్ ఎన్.రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ టి.రామమోహన్రావు మరియు డాక్టర్ స్వర్ణ శ్రీనివాసులపై మేజర్ పెనాల్టీ విధించేందుకు తగు శాఖాపరమైన విచారణ చేపట్టాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
నిర్లక్ష్యంతో నెల్లూరు మునిసిపాలిటీ ఆదాయానికి గండి
నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్లో ఆరోగ్యాధికారిగా ఉంటున్న డాక్టర్ పి.వెంకటరమణయ్య కార్పొరేషన్ కు రావాల్సిన దాదాపు రూ.12 కోట్ల ఆదాయం వసూలు విషయంలో నిర్లక్ష్యం వహించారని, ఇందుకు సంబంధించిన అధికారుల పనితీరును పర్యవేక్షించడంలో విఫలమయ్యారని ఎసిబి నివేదిక ఇచ్చింది. కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం పనితీరుపై...అవినీతి, అక్రమాలు, వ్యాపారుల్ని వేధించడం వంటి ఫిర్యాదులపై ఎసిబి విచారణ జరిపింది. నగరంలోని 44 ఆసుపత్రులు అనుమతులు లేకుండా పనిచేస్తున్నా ఆరోగ్యాధికారి పట్టించుకోలేదని, 27 పంక్షన్ హాళ్లను తనిఖీ చేయలేదని కూడా ఆరోపణలొచ్చాయి. వీటిపై ఎసిబి ఏప్రిల్ 2022 లో ఆకస్మిక తనిఖీ జరిపి విచారణ చేపట్టింది. డాక్టర్ వెంకటరమణయ్య ఆరోగ్య శాఖ అధికారి కనుక అతనిపై తగు క్రమశిక్షణా చర్యల్ని చేపట్టేందుకు ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ నగర పాలన మరియు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు తమ ఆమోదాన్ని తెలిపారు.