ప్రభుత్వ పాలసీలతో పైకొచ్చిన వారు పేదలకు చేయూతనివ్వాలి
ప్రభుత్వ పాలసీలతో పైకొచ్చిన వారు పేదలకు చేయూతనివ్వాలి
సీఎం చంద్రబాబు నాయుడు
ఎచ్చెర్ల, ఏప్రిల్ 26 : ప్రభుత్వ పాలసీలతో ఆర్థికంగా పైకొచ్చిన వారు సమాజంలోని పేదలకు చేయూతనిచ్చి అన్ని విధాలా వారిని అభివృద్ధి చేసేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రజావేదిక సభలో జీరో పావర్టీ-పీ4 కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలి. పేదలకు ప్రభుత్వ పథకాలు అందివ్వడమే కాకుండా మార్గదర్శుల ద్వారా సాయం అందించి అన్ని విధాలా పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మార్గదర్శులు దత్తత తీసుకున్న కుటుంబాలకు ఏం చేస్తున్నాయో కూడా సమీక్ష చేస్తాం. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నది నా లక్ష్యం. అన్ని విధాలా ఆర్థికంగా పైకొచ్చిన వారు పేద కుటుంబాలను ఆదుకుంటే సమాజంలో అసమానతలు ఉండవు.’ అని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతరం మార్గదర్శులకు సీఎం చంద్రబాబు శాలువాలు కప్పి సన్మానం చేశారు.
బంగారు కుటుంబానికి ఎంపికైన వారు మాట్లాడుతూ....
అలుపు లచ్చమ్మ :నా భర్త ఉపాధి కోసం గుజరాత్ వెళ్లారు. నేను ఇంటి వద్దే ఉంటూ పిల్లల్ని చూసుకుంటాను. మాది పేద కుటుంబం.
సూరాడ అప్పన్న : మా అమ్మనాన్న లేరు. మా అక్కకు 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. కానీ రెండేళ్లకే మానసిక సమస్యను ఎదుర్కోవడం వల్ల ఆమెను భర్త వదిలేశారు. ప్రస్తుతం ఆమె, పిల్లలు మా వద్దే ఉంటున్నారు. నా భార్య బీఎస్సీ కంప్యూటర్ చేసింది. నేను, నా తమ్ముడు వేటకు వెళ్లి మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. 8 మందిమి కలిసి ఒకింట్లో ఉంటున్నాం. మా అక్కకు పెన్షన్ ఇప్పించిండి.
సీఎం : మీ సోదరికి వెంటనే పింఛన్ అందిస్తాం. ఇల్లు నిర్మిస్తాం.
మార్గదర్శులు మాట్లాడుతూ....
గురిపూడి శ్రీరామ మూర్తి : నేను ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్డ్ అయ్యాను. ఈ ప్రాంతంలో డిగ్రీ, పీజీ, డిప్లమో, అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సులతో కాలేజీ పెట్టాం. రాష్ట్ర ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరిగితే మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు ఆలోచన. నేను 25 కుటుంబాలను దత్తత తీసుకుంటాను. అప్పన్న ఇంట్లో కంప్యూటర్ ఏర్పాటు చేసి ఆయన భార్యకు నైపుణ్యం పెంచి మా వ్యవసాయ కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్గా, ప్రోగ్రామర్గా అవకాశం కల్పిస్తాం. వారి పిల్లలను మా కాలేజీలో ఉచితంగా చదివిస్తాం.
పీవీఎస్ రామ్మోహన్ : నేను కూడా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. 1995-2004 మధ్య సీఎం చంద్రబాబు ఐటీ స్కిల్ డెవలెప్మెంట్ కార్యక్రమం చేపట్టారు. మేము అబ్రాడ్లో కంపెనీ పెట్టాం. 2018లో పైడి భీమవరంలో హెల్త్ కేర్ ఇండస్ట్రీ పెట్టాం. కోవిడ్ సమయంలో మా పరిశ్రమ ద్వారా ఆక్సిజన్ అందించాం. చంద్రబాబుకు మేం రుణపడి ఉన్నాం. మా పరిశ్రమ తరపున లచ్చమ్మ కుటుంబానికి సాయం అందించడంతో పాటు 20 కుటుంబాలను దత్తత తీసుకుంటాం. మత్య్సాకారులకు టూల్ కిట్స్, బోట్స్, వారి పిల్లలకు చదవును అందించడంతో పాటు స్కాలర్ షిప్స్ అందిస్తాం.
పలు మత్య్సకార కుటుంబాలతో భేటీ:
శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభోత్సవంలో భాగంగా గ్రామంలోని పలు మత్య్సకార కుటుంబాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. మొదట సముద్రతీరంలో మత్య్సకార కుటుంబం అయిన మద్దు పోలేష్, రామలక్ష్మీతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కారి రాంబాబు, ఉప్పాడ సీతోగ్య, చింతపల్లి ఎర్రయ్యతో ముచ్చటించారు. అనంతరం ఎండుచేపలను పరిశీలించి మద్దు లక్ష్మమ్మ, కారి సీతమ్మ, వారధి పైడమ్మతో మాట్లాడి చేపలు ఎండబెట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రోజువారీ ఆదాయం గురించి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్కు చేరుకున్న సీఎం...చేపల బోట్లు మరమ్మతులు చేసే కార్మికులు మైలపల్లి పోతురాజు, కారి రాంబాబుతో కాసేపు సంభాషించారు. చేపలు నిల్వ చేసుకునే ఐస్ బాక్సులు, చేపలు పట్టే వలలను పరిశీలించారు.