రోహింగ్యాల వలసలతో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు ప్రమాదం
• స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంలో వ్యవస్థలోని కొందరు ప్రాత్ర ఉంది
• సరిహద్దుల్లో సైనికుల అప్రమత్తత కంటే మిన్నగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
• దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నిత లక్ష్యాల్లో ఉన్నాయి
• తీరంలో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలి
• కుంకీ ఏనుగుల ద్వారా మదపుటేనుగుల గుంపు సమస్యకు పరిష్కారం లభిస్తుంది
• గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్
‘సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకం. దీనిపైనే రాష్ట్ర పోలీసులను, పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూ లేఖ రాశాన’ని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యం అని గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలింది. కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని చెప్పారు. సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటారో, రాష్ట్ర పోలీసులు కూడా అంతర్గత భద్రతపై అంతే సీరియస్ గా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో ఉగ్రవాదుల జాడలు కనిపించిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని నేను లేఖ ద్వారా డీజీపీ గారిని కోరాను. పాలనా యంత్రంగంతో సమన్వయం చేసుకొని ఉగ్రవాద జాడలు కలిగిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించాను. ముఖ్యంగా వలసదారుల విషయంలో తగిన నిఘాను ఉంచితే జరగబోయే ప్రమాదాలను నివారించవచ్చు. అలాగే తీర ప్రాంతంలో సైతం నిరంతర పర్యవేక్షణ, నిఘా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలోనూ కాకినాడలో బయట వ్యక్తులు బోట్లలో వచ్చినట్లు కొన్ని వార్తలు వచ్చాయి.
తీరంలో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలి
ఈ సందర్భంగా తీరంలో కొత్త వ్యక్తుల కదలికలు, వారి చర్యలను గమనించాల్సిన అవసరం ఉంది. పోలీసులు అజాగ్రత్తగా ఉండకుండా అంతర్గత భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన సంయుక్త ఆపరేషన్ లోనూ రాష్ట్రంలో కొన్ని ఉగ్రవాద జాడలు కనిపించినట్లు తెలుస్తోంది.
• రోహింగ్యాల వలసలపై దృష్టి సారించాలి
గతంలో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు విపరీతంగా రోహింగ్యాలు వలసదారులు వచ్చారు. ముఖ్యంగా 2017-18 ప్రాంతాల్లో కోల్ కత నుంచి స్వర్ణకార వృత్తి నిమిత్తం చాలా అధికంగా వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చారు. రోహింగ్యాల మూలాలు మయన్మార్ లో ఉన్నాయి. వారి వలసలతో స్థానిక యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండు. తెలంగాణ ఏర్పాటులో ఉన్న మూడు ప్రధాన డిమాండ్లలో స్థానికులకే ఉద్యోగాలు అనేది కూడా ప్రధాన నినాదం. అయితే రోహింగ్యాలు దేశం దాటి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకునేలా రేషన్, ఆధార్, ఓటరు కార్డులు పొందుతున్నారు. మన యువతకు చెందాల్సిన ఉద్యోగాలు, వ్యాపారాలు వారు చేసుకుంటున్నారు. రోహింగ్యాలకు స్థిర నివాసం ఏర్పరుచుకోవడంలో మన యంత్రాంగం నిర్లక్ష్యం ఉంది. వారికి ఎలా ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు వస్తున్నాయి..? ఎవరు ఇస్తున్నారనేది తేలాలి. మన వ్యవస్థలోనే కొందరు వ్యక్తులు వారికి సహకరిస్తున్నారని అర్ధం అవుతుంది. రోహింగ్యాలు ఈ దేశ పౌరులుగా మారి, మన అవకాశాలను ఎలా కొల్లగొడుతున్నారనే దానిపై అందరిలోనూ చైతన్యం రావాలి. రోహింగ్యాలు స్థానికులుగా మారడానికి సహరిస్తున్న యంత్రాంగంపై కన్నేసి ఉంచాలని, అంతర్గత భద్రతలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు బాధ్యత గల ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా స్పందిస్తూ లేఖ రాశాను.
• కుంకీ ఏనుగుల ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది
సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మదపుటేనుగుల గుంపులు పంట పొలాల్లోకి వస్తూ పంటకు, పొలాలలో ఉన్నవారి ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల అలాంటి ఘటనలు చూశాం. ముఖ్యంగా చిత్తూరు, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఈ సమస్య ఉంది. వీటికి పరిష్కారంగా గతంలోనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి 6 కుంకీ ఏనుగుల కోసం ఒప్పందం చేసుకున్నాం. దీనికి అనుగుణంగా రాష్ట్రానికి 6 కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన ఇవ్వనుంది. కుంకీ ఏనుగుల ద్వారా మదపుటేనుగుల విధ్వంసం నుంచి బయటపడగలం అనే నమ్మకం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సహకారం కర్ణాటక ప్రభుత్వం అందించడం అభినందనీయం. దీంతో ఏనుగులతో వస్తున్న సమస్య చాలా వరకు తీరుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.