పర్యాటక అభివృద్ధిలో భాగంగా స్టార్ హోటళ్ల ఏర్పాటు
పర్యాటక అభివృద్ధిలో భాగంగా స్టార్ హోటళ్ల ఏర్పాటు
పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు
జిల్లాలో పర్యటించిన పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్
భోగాపురం ఎయిర్పోర్టు ప్రాంతంలో హోటళ్లు, రిసార్టుల పరిశీలన
ఎయిర్పోర్టు నిర్మాణం పనులు పరిశీలన
జిల్లాలో భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రాంతానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం వుందని, పర్యాటకుల వసతి కోసం అవసరమైన హోటళ్లు, రిసార్టుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. భోగాపురం ప్రాంతంలో నిర్మాణంలో వున్న ఏర్పాటు కానున్న పలు హోటళ్లు, రిసార్టులను పరిశీలించే నిమిత్తం జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తో కలసి ఆయన శుక్రవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధికి హోటళ్ల నిర్మాణం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
భోగాపురం మండలంలోని రెడ్డికంచేరు వద్ద సన్రే- అవని గ్రూపు ఆధ్వర్యంలో రూ.100 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న బీచ్ రిసార్ట్స్ను పరిశీలించారు. కవులవాడ వద్ద ఇదే గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం పనులను పరిశీలించారు. సుమారు 3 వేల మందికి వసతి కల్పించేలా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని సన్రే గ్రూపు ఎం.డి. రాజబాబు యీ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వివరించారు. దీని ద్వారా 300 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అక్కడ సన్రే గ్రూపు ఆధ్వర్యంలో నిర్మించిన బీచ్ రిసార్టులు, గోల్ఫ్ కోర్సును ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పరిశీలించారు. ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన గ్రీన్హౌస్లను పరిశీలించారు.
పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఈ సంస్థ సవరవల్లి ప్రాంతంలో సన్రే రిసార్టుకు అనుబంధంగా ఏర్పాటు చేయనున్న త్రీ స్టార్ హోటల్ ప్రాజెక్టుకు ఆ ప్రాంతంలో అందుబాటులో వున్న 3.6 ఎకరాల ప్రభుత్వ భూమి అందజేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్కు సూచించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఇవ్వడంతోపాటు తక్కువ ఖర్చుతో పర్యాటకుల వసతుల కల్పనకు బహుళ విధాలుగా ఉపయోగపడేలా వుండాలని చెప్పారు.
జిల్లా సరిహద్దున భీమిలి మండలం అన్నవరం సముద్రతీరంలో ఏర్పాటవుతున్న మే ఫెయిర్ హోటల్ నిర్మాణ స్థలాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ పరిశీలించారు. రూ.40 కోట్ల వ్యయంతో ఏర్పాటవుతున్న యీ ఫైవ్ స్టార్ హోటల్కు భూముల కేటాయింపులపై భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్ తో మాట్లాడారు. హోటల్కు రహదారి నిర్మాణంపై కూడా ఆరా తీశారు.
అన్నవరం వద్ద ఓబెరాయ్ గ్రూపు ఆధ్వర్యంలో నిర్మాణంలో వున్న ఫైవ్ స్టార్ హోటల్ను పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పరిశీలించారు. నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలపై ఆ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా మినహా ఎలాంటి సమస్యలు లేవని నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు. రోజుకు 9 గంటలు మాత్రమే త్రీ ఫేజ్ సరఫరా వస్తోందని అందువల్ల సమస్యగా వుందన్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు.
విజయనగరం పట్టణంలో రోడ్లు భవనాల శాఖ స్థలంలో స్టార్ హోటల్ నిర్మించడం ద్వారా పర్యాటకుల వసతుల కల్పనకు ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్కు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి అజయ్ జైన్ సూచించారు. ఈ స్థలంలో హోటల్ నిర్మాణం ద్వారా అతిథిగృహం నిర్మాణంతోపాటు హోటల్ కూడా ఏర్పాటు చేయవచ్చని తద్వారా రోడ్లు భవనాల శాఖకు కూడా ఆదాయం సమకూరుతుందన్నారు.
జిల్లాలో గృహనిర్మాణ ప్రగతిపై కూడా ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వున్న అజయ్జైన్ కలెక్టర్తో ఆరా తీశారు. గృహనిర్మాణానికి అదనపు సహాయం ప్రకటించినందున గృహనిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. ఇళ్ల నిర్మాణానికి ఇదే సరైన సమయమని చెప్పారు. గృహనిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్టు డైరక్టర్ మురళి గృహనిర్మాణ ప్రగతిపై వివరించారు.
ఈ పర్యటనలో పర్యాటక శాఖ ప్రాంతీయ డైరక్టర్ జి.వి.బి.జగదీష్, జిల్లా పర్యాటక అధికారి కుమారస్వామి, ఆర్.డి.ఓ. కీర్తి, భీమిలి ఆర్.డి.ఓ. సంగీత్ మాధుర్, తహశీల్దార్ సురేష్, విశాఖ జిల్లా పర్యాటక అధికారి మాధవి తదితరులు పాల్గొన్నారు.
భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం పనుల పరిశీలన
నిర్మాణంలో వున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ శుక్రవారం జిల్లా కలెక్టర్తో కలసి పరిశీలించారు. జి.ఎం.ఆర్.గ్రూపు సి.ఇ.ఓ. మన్మోయ్ రాయ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి టెర్మినల్ భవనం వద్ద స్వాగతం పలికి ఎయిర్ పోర్టు విశేషాలను వివరించారు. నిర్ణీత గడువు కంటే ముందుగానే ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తిచేసే దిశగా అత్యంత వేగవంతంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. నిర్మాణం పనులపై సంతోషం వ్యక్తంచేసిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యీ ఎయిర్పోర్టు ద్వారా యీ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.