ప్రభుత్వ ప్రణాళికలు సీఎం దార్శనికతకు అద్దం పడుతోంది
ప్రభుత్వ ప్రణాళికలు సీఎం దార్శనికతకు అద్దం పడుతోంది
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-
రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ సలహా మండలిలో సలహాదారుగా భాగస్వామ్యం కావడానికి ఆర్థిక శాస్త్ర నిపుణుడు, ఆర్ధశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత ప్రొ. అభిజిత్ బెనర్జీ అంగీకరించారు. ప్రొ. అభిజిత్ బెనర్జీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ప్రభుత్వం చేపట్టిన చర్యల వంటి అంశాలపై వారి మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాల సాధనలో భాగంగా వివిధ రంగాల నిపుణులతో కూడిన తెలంగాణ రైజింగ్ సలహా మండలిలో పాలుపంచుకోవాలని ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని బెనర్జీ అంగీకరించారు.
రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కల్పన అంశంపై చర్చిస్తూ, సంప్రదాయ నైపుణ్యాల్లో ఆధునిక డిజైన్, మార్కెటింగ్, సోషల్ మీడియా సాంకేతిక వినియోగంలో విశిష్టత కలిగిన స్వల్ప కాలిక కోర్సులను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రొ. బెనర్జీ అభిప్రాయపడ్డారు.
తద్వారా సంప్రదాయ కళాకారులను ఆధునిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ లో భాగంగా క్రాఫ్ట్స్, ఆర్ట్స్, సృజనాత్మకత వంటి అంశాలను చేర్చాలని చెప్పారు.
ట్రాన్స్ జెండర్లను పోలీస్, మున్సిపల్ శాఖల్లో నియమించడం, అలాగే, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాను సర్వీస్ సెక్టార్ గా అభివృద్ధి చేసే ప్రణాళికను ఎంచుకోవటం, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు అద్దం పడుతోందని ఈ సందర్భంగా అభిజిత్ బెనర్జీ అభినందించారు.
శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ విజన్ ను, ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ముఖ్యమంత్రి గారు వివరించారు. తెలంగాణ విశిష్టతలను, ఇక్కడున్న అనుకూల వాతావరణాన్ని ప్రపంచ దేశాల్లో చాటిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతుల సాధికారత, యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు స్కిల్ డెవెలప్మెంట్ దిశగా ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక చర్యలను ప్రస్తావించారు.
సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.