అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
విశాఖలో 5 లక్షల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు!
రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది భాగస్వామ్యం అయ్యేలా చూడాలి
26 జిల్లాల్లో 26 రోజుల పాటు యోగాభ్యసన కార్యక్రమాలు
సెలబ్రిటీలతో యోగా డే
విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో మంత్రుల బృందం సమీక్ష
26 రోజుల కేలండర్ ను రూపొందించాలని అధికారులకు ఆదేశం
ఉండవల్లిః విశాఖలో వచ్చే నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం అధికారులకు దిశానిర్దేశం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. యోగా ప్రధాని నరేంద్ర మోదీ గారి మనసకు దగ్గరైన కార్యక్రమం. రాష్ట్రాభివృద్ధికి మోదీ గారు ఎంతగానో అండగా నిలుస్తున్నారు. విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకునే అవకాశం రాష్ట్రానికి దక్కింది. అన్ని శాఖలు సమన్వయంతో కార్యక్రమం విజయవంతానికి కృషిచేయాలి. రేపటి నుంచి నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకు మొదటి మూడు రోజులు ప్రజలను సన్నద్ధం చేయాలన్నారు.
26 జిల్లాల్లో 26 రోజుల పాటు రోజుకో జిల్లాలో వినూత్న యోగాభ్యసన కార్యక్రమం
యోగాంధ్రలో భాగంగా 26 జిల్లాల్లో 26 రోజుల పాటు రాష్ట్ర కార్యక్రమం కింద రోజుకో జిల్లాలో 5వేల మందితో వినూత్నంగా యోగాభ్యసన కార్యక్రమాలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. ఇందులో యువత, మహిళలు, సీనియర్ సిటిజన్స్, పోలీసులు, దివ్యాంగులు, ఉద్యోగులు వంటి వివిధ విభాగాలను భాగస్వామ్యం చేయాలి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ధృవపత్రాలు ఇవ్వాలి. 26 జిల్లాల్లో 26 రోజుల పాటు జరిగే యోగా కార్యక్రమాలపై కేలండర్ ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సెలబ్రిటీలను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రధాన పట్టణాలు, నగరాల్లో యోగభ్యసన కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో 100 పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో వెయ్యి మందితో యోగా డే నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది భాగస్వామ్యం అయ్యేలా చూడాలి
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది భాగస్వామ్యం అయ్యేలా చూడాలని మంత్రుల బృందం అధికారులకు దిశానిర్దేశం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా యోగా దినోత్సవంలో పాల్గొనే వారి నుంచి రిజిస్ట్రేషన్లు తీసుకోవాలి. ప్రజలను సంసిద్ధం చేయాలి. విశాఖలో 5 లక్షల మందితో అంతర్జాతీయ యోగదినోత్సవం నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందం ఆదేశించింది. యోగాపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, సోషల్ మీడియా క్యాంపెయిన్ చేపట్టాలని సూచించింది. యోగాంధ్ర లోగోపైనా సమావేశంలో చర్చించారు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రుల బృందానికి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, హోంమంత్రి వంగలపూడి అనిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్ర డోలా బాలవీరాంజనేయస్వామి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, యోగా డే నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు అజయ్ జైన్, శశిభూషణ్, ముకేష్ కుమార్ మీనా, సురేష్ కుమార్, కోన శశిధర్, వినయ్ చంద్, వీరపాండ్యన్, హిమాంశు శుక్లా, దినేష్ కుమార్, ప్రకాష్ జైన్, విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంక బ్రతా బాగ్చీ తదితరులు పాల్గొన్నారు.