విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే పాఠ్యపుస్తకాలు, కిట్స్ సిద్ధం చేయండి
విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే పాఠ్యపుస్తకాలు, కిట్స్ సిద్ధం చేయండి
జూన్ 6నుంచి డీఎస్సీ పరీక్షకు
పకడ్బందీగా ఏర్పాట్లు
టీచర్స్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ కు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు
అంబేద్కర్ విదేశీ విద్య పునఃప్రారంభానికి గైడ్ లైన్స్ రూపొందించండి
ఈ ఏడాది నుంచి బాలికల ఉన్నత విద్యాభ్యాసానికి కలలకు రెక్కలు
పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్ష
జూన్ 6 నుంచి మెగా డిఎస్సీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖల ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో వివిధ అంశాలపై సుమారు 3గంటలకుపైగా సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... డిఎస్సీ పరీక్షల నిర్వహించే కేంద్రాలతోపాటు టిసిఎస్ ఆయాన్ సెంటర్లలో కంప్యూటర్లతోపాటు ఇతర సదుపాయాలు కల్పించాలని, డిఎస్సీ కాల్ సెంటర్లలో ఎటువంటి కాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. టెట్ పరీక్షల్లో అర్హతలే డిఎస్సీలో కూడా ఉంటాయన్నారు. అభ్యర్థుల విజ్ఞప్తిమేరకు సర్టిఫికెట్ల అప్ లోడింగ్ కు ఆప్షన్ సౌకర్యం కల్పించామని చెప్పారు. వెరిఫికేషన్ నాటికి సర్టిఫికెట్లు సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు.
ఇటీవల విడుదల చేసిన పదోతరగతి పరీక్షా ఫలితాలపై మంత్రి లోకేష్ సమీక్షించారు. ఇకపై అకడమిక్స్ పై దృష్టిసారించి వచ్చేఏడాది మెరుగైన ఫలితాల సాధనకు కృషిచేయాలని అన్నారు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వన్ క్లాస్ వన్ టీచర్ ప్రాతిపదికన జిఓ 117కి ప్రత్నామ్నాయం రూపొందించామని తెలిపారు. పదోతరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ఉత్తమ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట సన్మానానికి చర్యలు తీసుకోవాలన్నారు. టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ కు లోబడి పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని ఆదేశించారు. విద్యాశాఖలోని అన్నిరకాల సిబ్బంది బదిలీలను విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని అన్నారు.బడిఈడుకు వచ్చిన ఒక్క పిల్లవాడు కూడా బడిబయట ఉండకూడదని, పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులను చైతన్యపర్చాలని అన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి టెక్స్ట్ బుక్స్, విద్యార్థి మిత్ర కిట్స్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ...గత ప్రభుత్వం అటకెక్కించిన అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రారంభించడానికి అవసరమైన విధివిధానాలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు, లెక్చరర్ల కొరత, పనితీరు మెరుగుదలకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. డిగ్రీ కాలేజిల్లో త్రీమేజర్, సింగిల్ మేజర్ సబ్జెక్టుల్లో మెరుగైన విధానం అమలుకు స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు. క్యూఎస్ 100లో 2 ఎపి విశ్వవిద్యాలయాలు ఉండేలా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యార్థులు ఎటువంటి టెన్షన్ లేకుండా విద్యనభ్యసించేందుకు వీలుగా ఫీజు రీఎంబర్స్ మెంట్ సొమ్మును ప్రతి క్వార్టర్ కు విడుదల చేస్తామని చెప్పారు.
ఉన్నత విద్యనభ్యసించే బాలికల కోసం కలలకు రెక్కలు పథకాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు విధివిధానాలు రూపొందించాలని మంత్రి లోకేష్ అధికారులను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 205 ప్రభుత్వ గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి నిరుద్యోగయువత, ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ల బదిలీలకు మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, కాలేజ్ ఎడ్యుకేషన్ డైరక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరక్టర్ కృతికా శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు పాల్గొన్నారు.