అర్హులైన యస్ హెచ్ జి మహిళలకు సకాలంలో అవసరమైన రుణాలు ఇవ్వాలి
అర్హులైన యస్ హెచ్ జి మహిళలకు సకాలంలో అవసరమైన రుణాలు ఇవ్వాలి
-రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
మహిళా పెట్టుబడిదారులకు అవసరమైన రుణాలు ఇవ్వాలి.
అమరావతి: స్వయం సహాయక సంఘాలకు డిజిటల్ వార్షిక ఋణ ప్రణాళిక ద్వారా నమోదు చేసుకున్న విధముగా అవసరమైన ఋణాలను వారికి అవసరమైన సమయంలో కావలసిన వారికి ఇవ్వాలని. రుణాలు మంజూరు చేసేటప్పుడు ఆ సంఘమునకు ఉన్నగుర్తింపు, అర్హతకు తగిన విధంగా రుణాలు ఇవ్వాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వార్షిక ఋణ ప్రణాళిక, మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఋణాల మంజూరుపై సెర్ప్ కార్యాలయంలో సిఈఓ వాకాటి కరుణ అధ్యక్షతన బ్యాంకర్లతో సమావేశం జరిగింది. సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న ముఖ్యఅతిధి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఋణమొత్తం రెండు లక్షలు దాటినట్లైతే వారికి అవసరమైన ఋణాలు ముద్ర, పి యం ఈ జి పి, పి యం ఎఫ్ యం ఈ లేదా ఇతర స్కీమ్ లద్వారా వారికి కావలసిన రుణాలు పొందే విధంగా బ్యాంక్ మేనేజర్స్ సభ్యులకు సహకరించాలని కోరారు. మహిళల ఆద్వర్యంలో వ్యాపారాల కోసం ఋణాలు తీసుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి రెండు శాతం ఇంటర్ సబ్ వెన్షన్ కూడా వర్తిస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని మహిళా పెట్టుబడులను ప్రోత్సహించాలని తెలిపారు. మహిళలు నిర్వహించే వ్యాపారాల కోసం ఋణాలు తీసుకొని వ్యాపారాలు పెట్టుకొనే వారు సి జి టి యం యస్ ఈ స్కీమ్ క్రింద గ్యారంటీ పీజు చెల్లిస్తే ఆ ఋణ మొత్తం సెక్యూర్ చేయబడుతుందని మంత్రి తెలియజేశారు. విశ్వాస్ స్కీమ్ ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందేవిధంగా బ్యాంకర్స్ సహకరించాలని, యస్ హెచ్ జి సభ్యుల కుల, ఆదాయ వివరాయాలను సెర్ప్ అధికారులు బ్యాంక్ లకు ఇవ్వాలని కోరారు.
సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వాకాటి కరుణ మాట్లాడుతూ మహిళలు పొదుపు చేసుకున్న రూ|| ఇరవై రెండు వేల కోట్లలో సగం మొత్తం (50 %) వారికి కావాలసినప్పుడు అంతర్గత ఋణాలుగా ఉపయోగించుకునే విధం గా బ్యాంకర్స్ సహకరించాలని అన్నారు. మిగిలిన సగం (50 %) వారికి అధిక మొత్తంలో వడ్డీ వచ్చే విధంగా ఫిక్సెడ్ డిపాజిట్స్ చేయడం ద్వారా సంఘ సభ్యులకు అధిక వడ్డీ వచ్చే విధంగా బ్యాంకర్లు సహకరించాలని కోరారు. ప్రతి నెల 10 వ తేదీ లోపు బ్యాంక్ ల ద్వారా మంజూరు చేసిన రుణాల వివరాలను సెర్ప్ ఆఫీసుకు పంపించాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్ భాస్కరరావు మాట్లాడుతూ అన్ని బ్యాంక్ ల వారు డిజిటల్ యం సి పి ద్వారా వచ్చిన ఋణ ప్రతిపాధనలు మాత్రమే అంగీకరించాలని, సంఘ సభ్యులకు అవసరమైన ఋణాలు త్వరితగతిన మంజూరు చేయాలని ఆదేశించారు. బ్యాంకర్ లాగిన్ లో ఉన్న ఋణ ప్రతిపాధనలు త్వరితగతిన క్లియర్ చేయాలి అని ఆయన ఆదేశించటమైనది. ఈ సమావేశంలో స్త్రీనిధి బ్యాంక్ యండి ప్రసాదరావు పలువురు బ్యాంకర్లు పాల్గొన్నారు.