రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జూన్ 21న ఘనంగా అంతర్జాతీయ యోగా డే

InternationalYogaDay yogandhracampaign yogandhrapratibha Yogandhra AndhraPradesh yoga 11th national yoga National yoga day About yoga
Mounikadesk

జూన్ 21న ఘనంగా అంతర్జాతీయ యోగా డే

  • రెండు గిన్నీస్ బుక్ రికార్డులు , మొత్తం 22 ప్రపంచ రికార్డుల సాధన లక్ష్యంగా యోగాంధ్ర
  • విశాఖ వేదికగా ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకూ ఏర్పాట్లు
  • ప్రధాని మోదీ హాజరు కానున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపు
  • రౌడీయిజం , హింస ప్రేరేపించేలా జగన్ పరామర్శ యాత్రలు
  • కొట్టండి, చంపండి, వార్ డిక్లేర్ అంటూ చేసే హింసా నినాదాల్ని సమాజం అంగీకరించదు
  • సినిమాలో డైలాగ్ చెబితే తప్పులేదంటున్న వాళ్లు సినిమాల్లో చంపినట్టు నిజజీవితంలోనూ చంపేస్తారా
  • గోదావరి జలాలను రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి వాడుకుందాం
  • సముద్రంలో కలిసే నీళ్ల వాడకంపై వివాదం ఎందుకు
  • రెండు తెలుగు రాష్ట్రాలూ నెంబర్ వన్ గా ఉండాలన్నదే నా లక్ష్యం
  • మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


అమరావతి, జూన్ 19: విశాఖ వేదికగా ఈ నెల 21 తేదీన జరిగే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించు కుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రెండు గిన్నీస్ రికార్డులు, మొత్తం 22 ప్రపంచ రికార్డుల సాధన లక్ష్యంగా యోగా డే కార్యక్రమాన్ని తలపెట్టామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న ఈ కార్యక్రమాన్ని ప్రపంచం గుర్తించుకునేలా నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. సచివాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో యోగా డే కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలియచేశారు. 25 వేల మంది గిరిజన విద్యార్ధులు 108 నిముషాల పాటు సూర్య నమస్కారాలు చేస్తారని తెలిపారు. ఎక్కువ మంది ఒకే చోట చేయడం తో పాటు ఎక్కువ మంది ఒకే సారి సూర్య నమస్కారాలు చేసి రెండు గిన్నీస్ రికార్డులను సాధించడమే లక్ష్యం గా కార్యక్రమం జరుగుతుందన్నారు. విశాఖ లోని రామకృష్ణా బీచ్ నుంచి భోగాపురం వరకూ 26 కిలోమీటర్ల మేర విస్తృత ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. . ఆర్కే బీచ్ వేదికగా మొత్తం 3.19 లక్షల మంది ఒకే చోటు నుంచి యోగా చేసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. యోగా డే రోజున విశాఖ సహా రాష్ట్రంలోనూ, దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల ప్రాంతాల్లో ఒకేసారి ప్రజలు పాల్గొంటారని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ... " యోగా డే లో పాల్గొనేందుకు 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారని అనుకున్నాం. అంచనాలకు మించి 2.39 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. మే 21 తేదీ నుంచి జూన్ 21 వరకూ నెల పాటు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాం. పర్యాటక ప్రాంతాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలతో పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ 15 వేల పైచిలుకు యోగా పోటీలు నిర్వహించాం . ఈ కార్యక్రమం నిర్వహణకు 5451 మంది మాస్టర్ ట్రైనర్లు వచ్చారు. నెల రోజుల పాటు నిర్వహించిన వేర్వేరు యోగా కార్యక్రమాలకు సంబంధించి 1,05,58,299 మందికి సర్టిఫికేట్లు కూడా జారీ అయ్యాయి. యోగాలో పాల్గొనే వారందరికీ ఆధార్ తో అనుసంధానించి ప్రతీ ఒక్కరికి క్యూ ఆర్ కోడ్ జారీ చేశాం. యోగా చేసేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా వాహనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. యోగా కార్యక్రమం ప్రణాళికా ప్రకారం నిర్వహించేందుకు ఒక్కో కంపార్ట్ మెంట్ కు వెయ్యి మంది చొప్పున ఉండేలా 326 కంపార్ట్ మెంట్ లు సిద్ధం చేశాం. యోగా డే లో పాల్గొనే వారందరికీ 3.32 లక్షల టీ షర్టు లు , 5 లక్షల యోగా మ్యాట్ లు సిద్ధం చేశాం. అలాగే ఉదయం పూట కార్యక్రమం జరుగుతున్న రీత్యా టాయిలెట్ల కు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరిగాయి. యోగా ఫర్ ఒన్ ఎర్త్ ఒన్ హెల్త్ అనే థీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 9 తరగతి నుంచి విద్యార్ధులకు యోగా సిలబస్ చేర్చేలా కార్యాచరణ చేస్తాం. పాఠశాలల్లో వారానికి ఒకటీ రెండు సార్లు యోగా తరగతులు ఉండేలా ఆలోచన చేస్తున్నాం. యోగా డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుపైనా ఆలోచన చేస్తున్నాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. జూన్ 21 తేదీ ఉదయం 6.30 గంటల నుంచి 8 గంటల వరకూ యోగా డే కార్యక్రమం జరుగుతుందని సీఎం వివరించారు. 

రౌడీయిజం, హింసను ప్రేరేపించేలా జగన్ యాత్రలు

సినిమాల్లో మనుషుల్ని చంపారని నిజ జీవితంలోనూ చంపేస్తారా -జగన్ కు ఇదేం మానసికస్థితి

రప్పా రప్పా నరకటం అనే పదాన్ని సినిమాల్లో డైలాగులుగా చెబుతున్న జగన్.. సినిమాల్లో మనుషుల్ని చంపారని నిజ జీవితంలోనూ చంపేస్తారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ కు ఇలాంటి మానసిక స్థితి ఏమిటని అన్నారు. " రాష్ట్రంలో రౌడీయిజం, హింసను ప్రేరేపించేలా జగన్ పరామర్శ యాత్రలు చేస్తున్నారు. పోలీసులు ఇచ్చిన పర్యటన అనుమతులన్నీ జగన్ ఉల్లంఘించారు. ఇరుకు సందుల్లో సమావేశాలు నిర్వహించారు. తొక్కిసలాట జరిగింది. హింసను ప్రోత్సహించి పోలీసులపై నిందలు మోపారు. కొట్టండి, చంపండి అంటూ ప్లకార్డుల ప్రదర్శనతో ఆనందిస్తున్నారు. దేశంలోని ఏ రాజకీయనాయకుడికి, రాజకీయ పార్టీకి ఈ తరహా పోకడలు లేవు. సమాజంలో ఇలాంటి పోకడలు చాలా ప్రమాదకరం. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్ లు, రౌడీలకు విగ్రహాలు పెడుతున్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుడి గురించి ఆలోచించాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలపై చర్యలు తీసుకుంటాం. తాను చేసిందే చట్టం అంటే ఎలా కుదురుతుంది?. తప్పుడు పనులతో అతలాకుతలం చేస్తామంటే సరికాదు. రాజకీయం ముసుగులో రౌడీయిజం చేస్తే వదిలిపెట్టను. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు పరామర్శ చేస్తారా? కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే వైసీపీ హయాంలోనే నాగమల్లేశ్వరరావు చనిపోయాడు. విగ్రహాలు పెట్టి రౌడీలు, గంజాయి స్మగ్లర్ల ను హీరోలుగా మారుస్తున్నారు. రౌడీయిజం చేయాలని అందరికీ మార్గ దర్శనం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు రోడ్డు పైకి వస్తే భయంకర పరిస్థితులు వస్తాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ నేతల వాహనం ఢీకొని వ్యక్తి చనిపోతే పట్టించుకోరా.?" అని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటమే కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యమని, భవిష్యత్ ను తీర్చిదిద్దే నాయకుడి గురించి ప్రజలు ఆలోచించాలని సీఎం స్పష్టం చేశారు.   సముద్రంలో కలిసే నీళ్ల వాడకంపై వివాదం ఎందుకు

బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణా లేవనెత్తిన అభ్యంతరంపై సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి సముద్రంలో కలిసే జలాలను రెండు రాష్ట్రాలూ కలిసి వాడుకుందామని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ " గోదావరి లో నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుతున్నాయి. పోలవరం తప్ప మిగతావి అనుమతి రాని ప్రాజెక్టులే. విభజన చట్టంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. గోదావరి ప్రవాహంలో చిట్టచివరి రాష్ట్రంగా వచ్చిన నీటిని మరో బేసిన్ కు తరలిస్తున్నాం. గతంలో కృష్ణా బ్యారేజ్ పై ఇరు రాష్ట్రాల సిబ్బంది గొడవ పడ్డారు.గవర్నర్ వద్ద కూర్చొని గతంలో సమస్య పరిష్కరించుకున్నాం. కృష్ణా లో తక్కువ ఉన్న నీటిపై గొడవ పడితే లాభం లేదు. ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులను అలాగే కొనసాగిద్దాం. కొత్త ట్రిబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేనే చాలా ప్రాజెక్టులు మొదలుపెట్టాను. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులు నేనే మొదలు పెట్టాను. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై వివాదం వస్తే అసెంబ్లీలో పోరాడాం. కాళేశ్వరం గురించి ఎప్పుడూ నేను అభ్యంతరం చెప్పలేదు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి వాడుకునే నీటిపై ఎందుకు వివాదాలు పెట్టుకోవాలి. సముద్రంలో కలిసే నీటి వాడకంపై చట్టబద్ధత కావాలంటే కేంద్రంతో చర్చిద్దాం. సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంతవరకు సమంజసం? రెండు రాష్ట్రాల జల వివాదాల వల్ల ఎలాంటి లాభం లేదు. వివాదం సృష్టిస్తే ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది. ఈ అంశంపై పోరాటాలు అక్కర్లేదు. ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి" ఎవరు వద్దన్నారని ముఖ్యమంత్రి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Comments

-Advertisement-