65 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి దగ్గరకే రేషన్
65 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి దగ్గరకే రేషన్
మచిలీపట్నం జూన్ 1:
చౌక బియ్యం పక్కదారి పట్టకుండా ప్రజల కోరిక మేరకు మరల చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనలు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం నగరంలోని 37వ డివిజన్ రాజుపేట లోని చౌక ధరల దుకాణం నంబరు 7ను మంత్రివర్యులు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలసి పునః ప్రారంభించి కార్డుదారులకు 5 కిలోల బియ్యము, అర కిలో పంచదార, కిలో కందిపప్పు పంపిణీ చేశారు.
అలాగే 65 సంవత్సరాలు పైబడిన బోయిన సుశీల, గొడవర్తి మహాలక్ష్మి ఇండ్లకు మంత్రి, కలెక్టరు, సంయుక్త కలెక్టర్ తో కలిసి స్వయంగా వెళ్లారు. వృద్ధురాలు సుశీల అంత్యోదయ అన్న యోజన( ఏ ఏ వై )కార్డు కలిగి ఉండడంతో 35 కిలోల ఉచిత బియ్యము, ఒక కిలో పంచదార, ఒక కిలో కందిపప్పు పంపిణీ చేశారు. అనంతరం వారు మహాలక్ష్మికి 5 కిలోల బియ్యం, అరకిలో పంచదార, ఒక కిలో కందిపప్పు పంపిణీ చేశారు.
తదనంతరం మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చక్కని పరిపాలన అందించేందుకు కృషి చేస్తుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజా పంపిణీ వ్యవస్థ పైన ప్రత్యేక శ్రద్ధ వహించారని, ప్రజల నుండి చాలా విన్నపాలు వచ్చిన మీదట అవన్నీ గమనించి మరల చౌక ధరల దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆ నిర్ణయం మేరకు జూన్ 1వ తేదీ నుండి వినియోగదారులకు దుకాణాల చౌక దుకాణాల వద్ద బియ్యం తదితర సరుకులు పంపిణీ చేసే ఏర్పాటు చేశామన్నారు
గతంలో బియ్యం మొత్తం పక్కదారి పడుతుండేదని, చౌక దుకాణాల్లో ఉంటే తాము ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే అవకాశం ఉండేదని ఎండియు వాహనాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసి అన్ని రకాలుగా నష్టపోతున్నామని, కొంత బియ్యం కాకినాడ నుండి ఏ విధంగా షిపుల్లో అక్రమంగా ఏవిధంగా తరలిపోయిందో మనమందరం చూసామన్నారు.
చౌక బియ్యాన్ని ఒక పెద్ద స్కామ్ గా చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందన్నారు.
ప్రస్తుతం పారదర్శకంగా చేయాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకొని ప్రతినెల 15వ తేదీలోగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రజలు సరుకులు తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించారన్నారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరల సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దగ్గరలో ఉన్న చౌక దుకాణానికి పోయి సరుకులు తెచ్చుకునే వెసులుబాటు కల్పించిందన్నారు.
ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం చొప్పున కనీస ఆదరువు ప్రభుత్వం ఇస్తుందన్నారు. అర కిలో పంచదార 17 రూపాయలకు, కిలో కందిపప్పు 67 రూపాయలకు అందిస్తున్నామన్నారు
గతంలో చౌక దుకాణాల డీలర్లు కూడా చాలా ఇబ్బందులు పడ్డారన్నారు.
అలాగే 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన వారికి సరుకులను వారి ఇంటి వద్దకే డీలర్ తీసుకొని వచ్చి అందజేస్తారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి 25 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, అందులో నాలుగు కోట్ల పైన రేషన్ బియ్యం
తీసుకుంటున్నారన్నారు. కార్డులో ఎంతమంది ఉంటే ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున బియ్యం ఇస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డులలో తల్లిదండ్రులతో పాటు పెళ్లయిన పిల్లలు ఉంటే వారికి వేరుగా కార్డులు ఇచ్చే ఏర్పాటు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో దాదాపు 70 వేల రేషన్ కార్డులు ఉన్నాయని, కొత్తగా మరో 20 వేల దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వచ్చాయన్నారు. కార్డుల విషయంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని వాటికి కాలపరిమితి లేదన్నారు.
బియ్యం వద్దనుకునే వారికి ఆ బియ్యం ఖరీదును నేరుగా లబ్ధిదారులకు అందించాలని ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. .ప్రభుత్వం బియ్యం కొని పేద ప్రజలకు ఉచితంగా అందచేస్తుందన్నారు.
బియ్యానికి బదులుగా రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలను కూడా ప్రభుత్వం సరఫరా చేయాలని ఆలోచిస్తుందన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో చౌక దుకాణాల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీకి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఎవరికి ఇబ్బంది కలిగిన జిల్లా పౌరసరఫరాల అధికారిని సంప్రదించేలా వారి సెల్ ఫోన్ నంబర్తో ఒక బోర్డును ఏర్పాటు చేశామన్నారు. ప్రతినెల 5వ తేదీలోగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, మంచానికి పరిమితమైన వారికి సంబంధిత డీలర్లు వారి ఇంటి వద్దకే నిత్యవసర సరుకులు అందజేస్తారన్నారు.
సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ జిల్లాలో 5.22 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 1059 చౌక దుకాణాలకు నిత్యావసర సరుకులు సరఫరా చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఎస్ ఓ వి.పార్వతి, పౌరసరఫరాల సంస్థ డిఎం శిరీష, ఆర్ డి ఓ కే స్వాతి, స్థానిక ప్రముఖులు బండి రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ కౌన్సిలర్ చిన్ని, తహసిల్దారు పి మధుసూదన్ రావు, రేషన్ డీలర్ సైకాన్ సాంబమూర్తి తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.