కృష్ణా తరంగాలపై ప్రపంచ రికార్డుకు సర్వం సిద్ధం
కృష్ణా తరంగాలపై ప్రపంచ రికార్డుకు సర్వం సిద్ధం
- 200 వాటర్ క్రాఫ్ట్స్పై వెయ్యిమందితో ఫ్లోటింగ్ యోగాకు ఏర్పాట్లు
- యోగాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నం
- ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం
- కనుల విందుగా జరిగే బృహత్తర కార్యక్రమానికి ప్రతిఒక్కరూ ఆహ్వానితులే
- ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
- భారతీయ వారసత్వ సంపద ప్రతిఒక్కరికీ చేరువకావాలి
- మీడియా సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రతిఒక్కరికీ చేరువచేయాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర-2025లో భాగంగా ఈ నెల 11వ తేదీన బెరం పార్కు వద్ద కృష్ణమ్మ ఒడిలో ఉషోదయ వేళ యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ - ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలా మెగా ఈవెంట్ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డును కైవసం చేసుకునేందుకు చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. యోగాను ప్రతిఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేలా అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు పడవలపై యోగా మెగా ఈవెంట్కు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పంట్లు, బోట్లు, స్పీడ్ బోట్లు, కయాక్స్ బోట్లు, శాండ్ బోట్లు, జెట్ స్కీ, లైఫ్ బోట్లు వంటి 200 వాటర్ క్రాఫ్ట్స్పై వెయ్యిమందితో కామన్ యోగా ప్రోటోకాల్తో యోగాసనాలు వేయడం జరుగుతుందని వివరించారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ కార్యక్రమాన్ని పరిశీలించి, ప్రపంచ రికార్డుగా నమోదు చేయడం జరుగుతుందన్నారు. భానుని లేలేత కిరణాలు పరచుకొన్నవేళ ప్రకృతి రమణీయత మధ్య కనుల విందుగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రతిఒక్కరూ ఆహ్వానితులేనని.. ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యోగాచరణతో సంపూర్ణ ఆరోగ్యానికి చేరువై ఎన్టీఆర్ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంలో భాగస్వాములు కావాలన్నారు. మెగా ఈవెంట్ నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగంతో ఆయుష్ శాఖ, వైద్య ఆరోగ్యం, మునిసిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మత్స్య తదితర శాఖలతో పాటు అమరావతి బోటింగ్ క్లబ్ (ఏబీసీ), స్విమ్మర్ల అసోసియేషన్, యోగా శిక్షణ సంస్థలు వంటివి కూడా భాగస్వాములవుతున్నాయని కలెక్టర్ తెలిపారు.
పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు:
యోగా విశిష్టతపై ప్రజలకు అవగాహన కల్పించడం ఎంత ముఖ్యమో ఇలాంటి మెగా ఈవెంట్ల విషయంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవడం అంతే ముఖ్యమని.. ఈ నేపథ్యంలో గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, సుశిక్షితులైన బోట్ ఆపరేటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. బోట్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. గౌరవ ప్రధానమంత్రి చొరవతో నేడు యోగా విశ్వవ్యాప్తమైందని, గౌరవ ముఖ్యమంత్రి నెల రోజుల వ్యవధిలో రెండు కోట్ల మందికి యోగాను నేర్పించే లక్ష్యంతో యోగాంధ్ర-2025ను ఆవిష్కరించారని.. ఇంత మంచి కార్యక్రమాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో నిత్య యోగా ద్వారా ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పది లక్షల మందికి యోగాను నేర్పించేందుకు అయిదువేల మంది సర్టిఫైడ్ ట్రైనర్లతో కృషిచేస్తున్నామని.. ఇప్పటికే ఏడు లక్షల మంది రిజిస్టర్ అయ్యారన్నారు. పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. ఇప్పటికే గాంధీ హిల్, పవిత్ర సంగమం, హరిత బెరం పార్కులో నిర్వహించామని, త్వరలో కొండపల్లి ఖిల్లాపైనా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
సమావేశంలో అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో డా. తరుణ్ కాకాని, జిల్లా ఆయుష్ అధికారి డా. రామత్లేహి, డీపీఆర్వో ఎస్వీ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.