ఆర్టీజీఎస్ పనితీరు ఆదర్శప్రాయం
ఆర్టీజీఎస్ పనితీరు ఆదర్శప్రాయం
హిమాచల్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కితాబు
అమరావతి: రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) పనితీరు ఆదర్శప్రాయంగా ఉందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనా కొనియాడారు. బుధవారం ఆయన సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ ఆయనకు సాదర స్వాగతం పలికి ఆర్టీజీఎస్ పనిచేస్తున్న తీరు గురించి వివరించారు. విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచనల నుంచి ఆర్టీజీఎస్ అనే వ్యవస్థ ఏర్పాటు అయిందన్నారు. దేశంలో ఇలాంటి వ్యవస్థను కలిగిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఒక చక్కటి వారధిలా ఆర్టీజీఎస్ పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రభుత్వ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా అందేలా ఆర్టీజీఎస్ ప్రభుత్వ శాఖలకు అందిస్తున్న సాంకేతిక తోడ్పాటు గురించి తెలియజేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న డాటను అనుసంధానం చేసి ఒక పెద్ద డేటా లేక్ను ఆర్టీజీఎస రూపొందింస్తోందని, దీనివల్ల ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగడానికి, రియల్ టైమ్ డేటా అందుబాటులో ఉంటుందన్నారు. అవేర్ విభాగం ద్వారా ప్రజలకు వాతావరణం గురించిన సమాచారాన్ని రియల్ టైమ్లో అందజేస్తున్నామన్నారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించే తీరును రియల్ టైమ్లో తమ సంస్థ పర్యవేక్షిస్తోందని తెలిపారు. ప్రజలెవ్వరూ కూడా తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లనవసరం లేకుండా మనమిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. దీనిద్వారా ఇప్పటికే 455 రకాల సేవలు అందిస్తున్నామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు వెయ్యికి పైగా సేవలు అందించనున్నామని చెప్పారు. పాలన మరింత సరళతరం చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సును విస్తృతంగా ఉపయోగిస్తున్నామని, ఇందుకోసం ఆర్టీజీఎస్ లో ఏఐ హబ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రబోధ్ సక్సైనా మాట్లాడుతూ ఇలాంటి వ్యవస్థ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం సంతోషదాయకమన్నారు. ఇలాంటి సాంకేతిక తోడ్పాడుతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ అధనపు కార్యదర్శి జే. నివాస్, ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం. మాధురి తదితరులు పాల్గొన్నారు.