రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు యోగ శిక్షణ కార్యక్రమాలు
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు యోగ శిక్షణ కార్యక్రమాలు
- మూడు రోజులకు ఒక బ్యాచ్ చొప్పున రెండు బ్యాచ్ లకు ఆరు రోజులపాటు శిక్షణ
- మొదటి బ్యాచ్ లో 12 శాఖలు & రెండో బ్యాచ్ లో 25 శాఖల ఉద్యోగులకు శిక్షణ
- మొదటి బ్యాచ్ కు నేటి నుండి 13 వరకు & రెండో బ్యాచ్ కు 17 నుండి 19 వరకు శిక్షణ
అమరావతి జూన్ 11: రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు యోగా శిక్షణ కార్యక్రమాలు రాష్ట్ర సచివాలయం సెంట్రల్ గార్డెన్లో ఆయూష్ శాఖ ఆద్వర్యంలో బుధవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. మొదటి బ్యాచ్ లో 12 శాఖలకు చెందిన ఉద్యోగులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి నుండి 13 వ తేదీ వరకు జరుగనున్న మొదటి బ్యాచ్ శిక్షణా కార్యక్రమాల్లో వ్యవసాయం మరియు మార్కెటింగ్ , సాధారణ పరిపాలన, ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమం, హోమ్ , పరిశ్రమలు & వాణిజ్యం ,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ , ప్లానింగ్ , పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, , జలవనరులు, ఆర్ధిక మరియు న్యాయ శాఖల ఉద్యోగులు పాల్గొంటున్నారు. అదే విధంగా రెండో బ్యాచ్ లో దాదాపు 25 శాఖలకు చెందిన ఉద్యోగులకు ఈ నెల 17 నుండి 19 వ తేదీ వరకూ యోగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుచున్నది.
ఈ శిక్షణా కార్యక్రమాల ప్రారంభంలో ఆయుష్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ప్రధాన వేదికగా విశాఖపట్నంలోను మరియు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కేంద్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. "ఒక భూమి, ఒక ఆరోగ్యం కోసం యోగా," అనే థీమ్ తో నిర్వహించే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా నిర్వహించే ఈ వేడుకల్లో దాదాపు దాదాపు ఐదు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు, శిక్షణా కార్యక్రమాలను యోగాంధ్ర-2025 లో భాగంగా నిర్వహించడం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర ప్రజలకు యోగా ప్రాముఖ్యతను తెలిపేందుకు మరియు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో వారిని భాగస్వాములు చేసేందుకు గత నెల 21 నుండి ఈ నెల 21 వరకూ యోగాంధ్రా-2025 కార్యక్రమాలను ప్రతి గ్రామంలోనూ నిర్వహించడం జరుగుచున్నదని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమ నోడల్ అధికారి మరియు అసిస్టెంట్ సెక్రటరీ సి. రాజశేఖర్ తో పాటు పలు శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.