పవిత్ర యోగా సంగమం..
పవిత్ర యోగా సంగమం..
- యోగా మన ఘన వారసత్వ సంపద
- రాష్ట్రం నలుమూలలకూ యోగాను చేరువచేసేందుకే యోగాంధ్ర
- యోగా ప్రతిఒక్కరి రోజువారీ టైమ్ టేబుల్లో మొదటి అంశం కావాలి
- విజయవంతంగా పవిత్ర సంగమం వద్ద యోగాంధ్ర కార్యక్రమం
- పీఎం సూర్యఘర్తో ప్రతి ఇల్లూ మినీ జనరేటర్ స్థాయికి ఎదగాలి
- సూర్య నమస్కారాలు మాదిరిగా పీఎం సూర్యఘర్ను సద్వినియోగం చేసుకోవాలి
- ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఎన్టీఆర్ జిల్లా, (పీపుల్స్ మోటివేషన్):-
యోగా మన ఘన వారసత్వ సంపద అని.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతిఒక్కరూ తమ రోజువారీ టైమ్టేబుల్లో మొదటి అంశంగా చేసుకోవాలని ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా ఆదివారం జిల్లా ఆయుష్, పర్యాటకం, వైద్య ఆరోగ్యం తదితర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వీటీపీఎస్ భాగస్వామ్యంతో ఇబ్రహీంపట్నం, పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. వివిధ శాఖల అధికారులు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు, యోగా ఔత్సాహికులతో కలిసి యోగాసనాలను అభ్యసించారు. ఈ సందర్భంగా చక్రధర్బాబు మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి చొరవ కారణంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నామని, ఇది దేశానికే గర్వకారణమన్నారు. రాష్ట్రం నలుమూలలకూ యోగా విశిష్టతను చేరువచేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంతమంచి కార్యక్రమంలో ఏపీ జెన్కో భాగస్వామ్యం కావడం ఆనందం కలిగిస్తోందన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలతో పాటు అనేక ప్రజాప్రయోజన కార్యక్రమాల్లో జెన్కో భాగస్వామ్యమవుతూ ఎప్పుడూ ముందుంటోందన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన, అంతరాయాలకు ఆస్కారం లేని విద్యుత్ సరఫరాకు కృషిచేస్తున్నామని, రాష్ట్ర విద్యుత్ రంగానికి దేశంలో మంచి గుర్తింపు ఉందన్నారు. ప్రసార నష్టాలను తగ్గించడంలోగానీ, నాణ్యమైన విద్యుత్ను అందించడంలోగానీ ముందంజలో ఉన్నట్లు తెలిపారు. మన ఆరోగ్య సంరక్షణకు రోజూ ఉదయం సూర్య నమస్కారాలు ఎలాగైతే చేస్తామో అదేవిధంగా ప్రతిఒక్కరూ పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రూఫ్టాప్ సోలార్ వ్యవస్థను రాయితీతో ఏర్పాటుచేసుకోవాలని, ప్రతి ఇల్లూ మినీ విద్యుత్ జనరేటర్గా ఎదగాలని కోరుకుంటున్నట్లు జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు తెలిపారు.
ప్రతి గ్రామం, వార్డులో విస్తృతంగా యోగాంధ్ర కార్యక్రమాలు: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి వార్డులోనూ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఇదే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మొదటిగా గాంధీ హిల్పై నిర్వహించామని, ఇదేవిధంగా ఆదివారం పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. మనం చేసే ప్రతి పనిద్వారా మంచి ఫలితాలు రావడానికి, ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకునేందుకు యోగా ఉపయోగపడుతుందని, జూన్ 21 నాటికి మన జిల్లాలో కొత్తగా పది లక్షల మందికి యోగాను నేర్పించాలనే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆయుష్ డిపార్టుమెంట్ 45 నిమిషాల కామన్యోగా ప్రోటోకాల్ ఆధారంగా యోగాను ప్రతి వర్గానికీ చేరువచేసేందుకు కృషిచేస్తున్నామని.. ఇందుకు ప్రతిరోజు ఒక థీమ్ పెట్టుకొని యోగా అవగాహన, అభ్యసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ యోగాను ప్రాక్టీస్ చేసి, మరో పదిమందితో ప్రాక్టీస్ చేయించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కార్యక్రమంలో చిన్నారుల ఆర్టిస్టిక్ యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
డ్రగ్స్ రహిత జిల్లా, రాష్ట్రం లక్ష్యంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమం:
కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. ఈగెల్ ఎస్పీ ఎన్.నగేష్బాబు, ఇతర అధికారులతో కలిసి డ్రగ్స్ వద్దు బ్రో (1972 టోల్ ఫ్రీ నంబరు) నినాదంతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. డ్రగ్స్ భూతాన్ని సమాజం నుంచి తరిమేసే లక్ష్యంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను అమలుచేస్తున్నామని, డ్రగ్స్ రహిత జిల్లా, రాష్ట్రం లక్ష్యంగా భాగస్వామ్య పక్షాలతో కలిసి కృషిచేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
కార్యక్రమంలో వీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ పి.శివరామాంజనేయులు, యోగాంధ్ర నోడల్ అధికారులు డా. ఎం.సుహాసిని, జిల్లా పర్యాటక అధికారి శిల్ప, జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడల్ అధికారి డా. వి.రాణి, ఆయుష్ అధికారి డా. రామత్లేహి, డా. రత్నప్రియదర్శిని, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, కొండపల్లి మునిసిపల్ కమిషనర్ రమ్య కీర్తన, వీటీపీఎస్ ప్రతినిధులు సీహెచ్ వి.రమణమూర్తి, పి.అనూరాధ, ఎస్ఈలు, ఈఈలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.