సూపర్ సిక్స్ హామీల్లో మరో ముఖ్య పథకానికి గ్రీన్ సిగ్నల్.
సూపర్ సిక్స్ హామీల్లో మరో ముఖ్య పథకానికి గ్రీన్ సిగ్నల్.
ప్రతి విద్యార్థి తల్లికి కానుకగా ‘తల్లికి వందనం’.
67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తింపు
తల్లుల ఖాతాల్లో రేపే రూ.8,745 కోట్లు జమ
పథకం అమలుపై సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం
అమరావతి, జూన్ 11 ఎన్నికల హామీల్లో భాగంగా మరో ముఖ్యమైన పథకం తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం సచివాలయంలో పథకం అమలు, విధివిధానాలపై సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్, పయ్యావుల కేశవ్, అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపే తల్లులకు కానుకగా పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అర్హులైన విద్యార్థుల ప్రతి తల్లి ఖాతాలో తల్లికి వందనం నిధులను జమ చేయాలని సీఎం ఆదేశించారు. పాఠశాలలు తెరిచేలోగా పథకం అమలు చేస్తామని గతంలోనే సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికి అనుగుణంగా తల్లికి వందనం పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సమీక్షలో విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ....అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామని అన్నారు. పథకాన్ని ఎలా అమలు చేయబోతున్నామనే విషయాన్ని సమీక్షలో వివరించారు. ఇక పథకం అమలుకు అవసరమైన నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో.. 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద రేపు నగదును ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఇందుకు అనుగుణంగా రూ.8,745 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గుర్తించిన విద్యార్థులతో పాటు.. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్ధులకు పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. వీరికి సంబంధించిన వివరాలు అందగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఈ మేరకు విధి విధానాలను ఖరారు చేస్తూ ఇవాళే జీవో విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పథకం అమల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. సాంకేతిక కారణాలతో జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకున్న వెంటనే పథకం వర్తింపజేస్తామని సీఎం అన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం...తాజాగా తల్లికి వందనం పథకం అమలుకు పచ్చజెండా ఊపింది.