టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు
టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు
• పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలో రూ. 308 కోట్ల అభివృద్ధి పనులు
• పిఠాపురం పట్టణంలో 100 పడకల ఆసుపత్రికి శ్రీకారం
• విద్యా, వైద్యం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి
• పల్లె పండగ ద్వారా గ్రామీణ రహదారులకు మహర్దశ
• రైతులకు అండగా మినీ గోకులాలు, వ్యవసాయ పరికరాలు
• శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
• పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు
• దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా అడుగులు వేస్తున్న పిఠాపురం
• ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
‘పిఠాపురం నియోజక వర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను’ – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన మాట. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఏడాది కాలంలోనే రూ.308 కోట్లకు పైగా నిధులను పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చించారు. విద్యా, వైద్యం, మౌలిక వసతుల కల్పనతోపాటు పారిశుధ్యం, సంపద సృష్టిపై దృష్టి సారించారు. పల్లె పండుగ ద్వారా పిఠాపురం పల్లెల్లో రహదారులకు కొత్త కళ వచ్చింది. గ్రామ గ్రామాన సీసీ రోడ్లు, బీటీ రోడ్లతో ప్రజలకు రహదారి కష్టాలు తీరుతున్నాయి. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని 100 పడకల ప్రాంతీయ వైద్యశాలగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. సంక్షేమ హాస్టల్స్ వసతుల కల్పనకు శ్రీకారం చుట్టి విద్యార్థినుల్లో స్థైర్యం నింపారు. ఏడాది కాలంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించారు. రికార్డు స్థాయిలో మినీ గోకులాల నిర్మాణంతో రైతులకు అండగా నిలిచారు. మహిళా స్వయం ఉపాధి లక్ష్యంగా టైలరింగ్ లో శిక్షణ ఇప్పించడంతో పాటు కుట్టు మిషన్లు, రైతులకు టార్పాలిన్లు, సబ్సిడీపై యంత్ర సామాగ్రి అందచేశారు. పిఠాపురం ప్రాంతాన్ని ప్రత్యేక యూనిట్ గా అభివృద్ధి చేసేందుకు వీలుగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. శాసన సభ్యుడిగా తన జీతాన్ని సైతం పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని చిన్నారుల సంరక్షణకు అందజేసి అవకాశం ఉన్న ప్రతి రూపాయిని పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రగతికే వినియోగిస్తూ వచ్చారు. ఏడాది పాలనలో రాష్ట్రంలోనే అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రంలోనే నంబర్ స్థానంలో పిఠాపురం నియోజకవర్గాన్ని నిలిపారు.
• తొలి అడుగు అభివృద్ధితోనే...
పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ శాసన సభ్యునిగా ఎన్నికైన అనంతరం ఆ నియోజకవర్గ ప్రజలు ఆయనతో కలసి విజయోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అభివృద్ధిలోనే తాను కనబడాలని భావించారు. మొదటి అడుగుతోనే పిఠాపురం నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గొల్లప్రోలు మండల పరిధిలో రూ. 5.52 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోపాటు వివిధ కార్పోరేట్ సంస్థల నుంచి వచ్చే సీఎస్ఆర్ నిధులను సమీకరించి పిఠాపురం అభివృద్ధికి జోడించారు. గొల్లప్రోలు తహసీల్దార్ భవనం, యు.పి.హెచ్.సి. ప్రహరీగోడ, సుద్దగడ్డ డ్రెయిన్ పై 9.2 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించారు. అ బ్రిడ్జ్ ద్వారా 2,200 కుటుంబాలకు ముంపు కష్టాలు తీరే ఏర్పాటు చేశారు. గొల్లప్రోలు ప్రజాపరిషత్ పాఠశాలలో తరగతి గదుల నిర్మాణంతోపాటు వివిధ అభివృద్ధి పనులకు మొదటి అడుగులోనే శ్రీకారం చుట్టారు. పారిశుధ్య నిర్వహణతోపాటు పిఠాపురం సుందరీకరణపై దృష్టి సారించి చెత్త నుంచి సంపద సృష్టి పైలెట్ ప్రాజెక్టును ఇక్కడే ప్రారంభించారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం చూపారు.
• ఉప్పాడ తీరం కోత నివారణకు ప్రణాళికలు
పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంతం ఆటుపోట్లకు కోతకు గురవుతూ సముద్రం గర్భంలో కలసిపోతూ ఉంది. దీన్ని అరికట్టి తీర ప్రాంతాన్ని రక్షించేందుకు అధునాతన జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోలేదు. ఎన్నికల సందర్భంగా ఉప్పాడ తీర ప్రాంత కోతకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రెండవసారి నియోజకవర్గ పర్యటనలోనే కోత నివారణకు జాతీయ స్థాయి నిపుణులను పిలిపించి కోతకుగల కారణాలు, నివారణా చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేశారు.
• పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి శ్రీకారం
పిఠాపురం సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించే విధంగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసేలా కృషి చేశారు. దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల అధ్యయనంతో పాటు నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఇది పని చేయనుంది. ప్రత్యేక అధికారులను నియమించి మరీ ఎప్పటికప్పుడు పిఠాపురం ప్రగతి, పురోగతిపై పవన్ కళ్యాణ్ సమీక్షిస్తున్నారు.
• రూ. 34 కోట్ల అంచనా వ్యయంతో 100 పడకల ఆసుపత్రి
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పిఠాపురం 30 పడకలతో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల స్థాయికి పెంచి ప్రాంతీయ ఆసుపత్రిగా రూపాంతరం చెందనుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అడుగే అభివృద్ధిగా ప్రస్థానం సాగుతోంది. ఉపముఖ్యమంత్రివర్యులు 100 పడకల ఆసుపత్రి పనులకు శంకుస్థాపన చేయారు. రూ.34 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకోనున్న ఈ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. కార్పోరేట్ తరహాలో రేడియాలజీ, డెర్మటాలజీ, ఆప్తమాలజీ వంటి విభాగాలు పిఠాపురం నియోజకవర్గంలోని 3 లక్షల మంది ప్రజలతోపాటు పరిసరాల్లోని ఆరు మండలాల ప్రజలకు మెరుగైన వైద్యం అందనుంది.
• పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా..
ఉప్పాడ కొత్తపల్లిలో రూ. 2 కోట్ల వ్యయంతో పేద ప్రజలు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు వీలుగా టీటీడీ కళ్యాణ మండపం నిర్మిస్తున్నారు. కళ్యాణ మండపం నిర్మాణం పనులు త్వరలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చేబ్రోలు గ్రామంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో హరికథలు, చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా రూ.48 లక్షల అంచనా వ్యయంతో కాలక్షేప మందిరం నిర్మాణం జరుగుతోంది. గొల్లప్రోలు మండలంలోని సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో రూ.కోటి 32 లక్షల అంచనా వ్యయంతో ప్రాకార మండపం నిర్మిస్తున్నారు.
• మహిళలకు కుట్టు మిషన్లు.. రైతులకు టార్పాలిన్లు
మహిళా స్వయం సమృద్ధి లక్ష్యంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని 3,456 మంది మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడంతో పాటు రూ.8. 64 కోట్ల ఖర్చుతో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. రూ.26 లక్షల వ్యవయంతో 2 వేల మంది చిన్న సన్నకారు రైతులకు టార్పాలిన్లు అందించారు. చేతికి వచ్చిన పంటను ఆకల వర్షాల బారి నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు వీలుగా టార్పాలిన్లు సమకూర్చారు. వ్యవసాయ యాంత్రీకరణ పనుల్లో బాగంగా 50 శాతం సబ్సిడీతో యంత్ర పరికరాలు అందజేశారు.
రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసి 189 మినీ గోకులాలు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. నియోజకవర్గం పరిధిలో గుంతలు లేని రహదారులు లక్ష్యంగా రూ.6.8 కోట్లతో మరమ్మతులు పూర్తి చేశారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా 294 బీటీ, సీసీ రోడ్లతోపాటు మూడు ప్రహరీ గోడలు, కొత్తపల్లి ప్రాథమిక వైద్యశాలలో ఓపీ బ్లాక్ నిర్మాణం చేపట్టారు. వీటితోపాటు మరో రూ. 20.58 కోట్ల అంచనా వ్యయంతో ఉపాధి హామీ పనుల్లో భాగంగా రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. నియోజక వర్గవ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లను ఆధునీకరించారు. రూ.4.78 కోట్లతో పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.4.06 కోట్ల వ్యయంతో గొల్లప్రోలు మొగలి సూరీడు చెరువు సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. వీటితోపాటు సుద్దగడ్డ ఏలేరు రిజర్వాయర్ ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
• జీతం మొత్తం కన్నవారు దూరమైన చిన్నారులకు...
పవన్ కల్యాణ్ తాను అందుకొంటున్న జీతం మొత్తాన్ని నియోజక వర్గానికే ఇచ్చేస్తున్నారు. పిఠాపురం నియోజక వర్గం పరిధిలో – కన్నవారు దూరమైన చిన్నారులకు ఆ మొత్తాన్ని ఇస్తున్నారు. నెలకు రూ.5 వేలు చొప్పున 42 మంది చిన్నారులకు ఆ మొత్తాన్ని అందచేస్తున్నారు. ఈ మొత్తంతో వారి జీవనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, వారిని బాగోగులు చూడటం సంరక్షకులకు భారం కాకుండా ఉంటుందని ఉప ముఖ్యమంత్రివర్యులు మానవతా దృక్పథంతో ఆ నిర్ణయం తీసుకున్నారు.
గత ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరం చేస్తే... నేడు పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేంద్రంగా మలిచారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ తొలి ఏడాదిలోనూ ప్రతి అడుగు అభివృద్ధి వైపు వేస్తున్నారు. ఏళ్ల తరబడి తీరని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం లాంటి సమస్యలను సైతం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సైతం సాకారం చేస్తున్నారు. పిఠాపురం కేంద్రంగా టెంపుల్ టూరిజం అభివృద్ధికి బాటలు వేశారు.