అవును నిజమే.. జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా సొమ్ము!
అవును నిజమే..
జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా సొమ్ము!
- ప్యానెల్ నివేదిక
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ మొత్తంలో డబ్బు బయటపడిన మాట వాస్తవమేనని ముగ్గురు న్యాయమూర్తుల విచారణ కమిటీ పేర్కొంది.
అవును నిజమే.. జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా సొమ్ము : ప్యానెల్ నివేదిక
ఇంటర్నెట్డెస్క్: జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో డబ్బు బయటపడిన మాట వాస్తవమే అని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ నిర్ధరించింది. ఆయన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న వేళ అధికారిక నివాసంలో పెద్ద సంఖ్యలో కాలిపోయిన నోట్ల కట్టలను గుర్తించారు. దీనిపై ప్యానెల్ తాజాగా 60 పేజీల నివేదిక ఇచ్చింది. ఇందులో 30 తుగ్లక్ క్రిసెంట్ రోడ్డులోని న్యాయమూర్తి అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో నోట్ల కట్టలను గుర్తించడం వాస్తవమేనని పేర్కొంది. ఆ సొమ్ములున్న స్టోరూమ్ నియంత్రణ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జస్టిస్ వర్మ లేదా అతని కుటుంబసభ్యుల ఆధీనంలోనే ఉందని అభిప్రాయపడింది. దీనికి సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నట్లు వెల్లడించింది. అగ్నిప్రమాదంలో దగ్ధమైన నోట్లను మార్చి 15వ తేదీ తెల్లవారుజామున అక్కడినుంచి తొలగించడమే బలమైన సాక్ష్యమని వెల్లడించింది. అసలు ఈ నోట్లను జస్టిస్ వర్మ లేదా ఆయన కుటుంబసభ్యుల స్టోరూమ్లో ఉంచడం అనుమానాస్పదంగా ఉందని అభిప్రాయపడింది. కాలిపోయిన నోట్లు చిన్న నోట్లు లేదా తక్కువ మొత్తం కాదని వెల్లడించింది.
తమకు లభించిన ఎలక్ట్రానిక్, ప్రత్యక్ష ఆధారాలను దృష్టిలో ఉంచుకొని సీజేఐ ఆరోపణలు నిజమేనని తేలుతోందని నివేదిక పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు జస్టిస్గా ఉన్న వర్మను విధుల నుంచి తొలగించడానికి ఈ ఆధారాలు సరిపోతాయని అభిప్రాయపడింది.
నా జీవితంలో అంత సొమ్ము చూడలేదు: సాక్షి
జస్టిస్ వర్మపై దర్యాప్తులో భాగంగా 10 రోజులపాటు 55 మంది సాక్షులను విచారించారు. వారి వాంగ్మూలాలను వీడియోలో చిత్రీకరించారు. ఈసందర్భంగా ఓ సాక్షి మాట్లాడుతూ ‘‘నేను ఆ గదిలోకి వెళ్లాను. అక్కడ కుడివైపు నేలపై రూ.500 నోట్ల కట్టలు భారీగా పడున్నాయి. షాకైపోయాను. నా జీవితంలో నేలపై అంత మొత్తం సొమ్ము పడి ఉండటాన్ని చూడలేదు’’ అని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో జస్టిస్ వర్మ కుమార్తె దియా, ఆయన ప్రైవేటు కార్యదర్శి రాజేందర్సింగ్ కార్కి తదితరులను కూడా ప్యానెల్ విచారించింది. అగ్నిమాపక సిబ్బంది తమ నివేదికలో నోట్ల వివరాలు నమోదు చేయకుండా రాజేందర్సింగ్ అడ్డుకొన్నట్లు తెలిసింది. కానీ, ఆ ఆరోపణలను ఆయన తిరస్కరించారు.
ఈ ఏడాది మార్చి 14న దిల్లీలోని జస్టిస్ యశ్వంత్వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా.. ఈ ఘటనలో భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం మార్చి 28న సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ యశ్వంత్వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసి.. ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని సూచించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. ఇది నిజమేనని ధ్రువీకరించిన త్రిసభ్య కమిటీ సంబంధిత నివేదికను సుప్రీం కోర్టుకు అందించింది.