రాజధాని అమరావతిపై పథకం ప్రకారమే వైఎస్ఆర్సిపి కుట్ర.
రాజధాని అమరావతిపై పథకం ప్రకారమే వైఎస్ఆర్సిపి కుట్ర.
- అమరావతి మహిళల ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే అనుచిత వ్యాఖ్యలు.
- నోటికొచ్చినట్లు మాట్లాడితే కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు.
- వైఎస్ఆర్సిపి నేతలు, జగన్ ఛానల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్..
- ఏలూరు జిల్లా ముదినేపల్లిలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
- ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
- ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
ప్రజారాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్సిపి నేతలు మొదటి నుంచి ఒక పథకం ప్రకారమే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మండిపడ్డారు. రాజధాని కోసం తమ భూములను త్యాగం చేసిన మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే జగన్ తన చానల్లో అనుచిత వ్యాఖ్యలు చేయించారని ఎంపీ మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని విషయంలో నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ విషం కక్కే ప్రయత్నం చేస్తే కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని ఎంపీ మహేష్ కుమార్ హెచ్చరించారు.
ప్రజల విజ్ఞప్తి మేరకు ఏలూరు జిల్లా ముదినేపల్లి వి.కన్వెన్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమంలో ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, టిడిపి జనసేన, బిజెపి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంపీ మహేష్ కుమార్ కు పుష్పగుచ్చాలు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారం కోరుతూ ఎంపీ మహేష్ కుమార్ కు అర్జీలు సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరైన ప్రజలు చెప్పిన సమస్యలను ఎంపీ మహేష్ కుమార్ ఓపికతో ఆలకించారు. ప్రజలు అర్జీల రూపంలో సమర్పించిన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, అలాగే వాటి పరిష్కారానికి సంబంధించిన నివేదిక తమ కార్యాలయంలో అందజేయాలని అధికారులను ఎంపీ మహేష్ కుమార్ ఆదేశించారు.
అనంతరం ఎంపీ మహేష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇకపై ప్రతి మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎంపీ తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వీలుందని, ఈ నేపథ్యంలో అధికారులు సహకరించాలని ఎంపీ కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ప్రజల కోసమే పనిచేసేందుకు ఉన్నామని, బాధ్యతగా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎంపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మంజూరు చేసేలా అధికారులు పర్యవేక్షించాలని ఎంపీ సూచించారు. నిధుల ప్రమేయం ఉన్న సమస్యల పరిష్కారానికి సంబంధించి అంచనాల నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని ఎంపీ అధికారులకు సూచించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. పార్లమెంట్ పరిధిలోని ప్రజలు ఇలాంటి సమస్య ఉన్న తమ కార్యాలయంలో సంప్రదించాలని, తాను లేని సమయంలో కూడా అర్జీలు కార్యాలయంలో అందజేయాలని ఎంపీ మహేష్ కుమార్ ప్రజలకు సూచించారు. కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ తనతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ, అభివృద్ధిపై చర్చిస్తుంటారని ఎంపీ తెలిపారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తో కలిసి కైకలూరు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కలిసి పనిచేస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా నెలకొన్న కొల్లేరు సమస్య కొలికి వస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా కొల్లేరు వాసులు పట్ల సానుకూలంగా ఉందని ఎంపీ పేర్కొన్నారు. కొల్లేరు సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎంపీ మహేష్ కుమార్ భరోసా ఇచ్చారు. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఎంపీ తెలిపారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఓర్వలేకనే ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలో రహదారుల అభివృద్ధికి నోచుకున్నాయని, మిగిలిన రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు.