ఏపీలో గృహ నిర్మాణంపై సింగపూర్ సంస్థ సుర్బానా జురాంగ్ ఆస్తక్తి
ఏపీలో గృహ నిర్మాణంపై సింగపూర్ సంస్థ సుర్బానా జురాంగ్ ఆస్తక్తి
- ఫాబ్రికేషన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎవర్సెండై సంస్ధ ప్రతిపాదన
- తొలిరోజు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు
- ఏపీలో పెట్టుబడి అవకాశాల్ని వినియోగించుకోవాలన్న సీఎం
సింగపూర్, జూలై 27 : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు గ్లోబల్ అర్బన్ ఇన్ఫ్రా కంపెనీ సుర్బానా జురాంగ్ స్పష్టం చేసింది. సింగపూర్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ సంస్థ ప్రతినిధి చెర్ఎక్లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో గృహ నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు ముందుకు రావాలని సీఎం సుర్బానా సంస్థను ఆహ్వానించారు. ఏపీలో హౌసింగ్ ఫర్ ఆల్ ప్రాజెక్టులో భాగం కావాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టిసారించామని ముఖ్యమంత్రి ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 20 పోర్టులు, 15 ఎయిర్ పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయని.. లాజిస్టిక్ హబ్ గా ఏపీ తయారవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాంతాలను ఇండస్ట్రియల్ టౌన్ షిప్లుగా అభివృద్ది చేయాలనే ప్రభుత్వ ఆలోచనలను వారి ముందుంచారు.
ఏపీలో పెట్టుబడికి ఎవర్సెండై ఆసక్తి
మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్సెండై కార్పొరేషన్ భెర్హాద్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తాన్శ్రీ ఏ. కె. నాథన్ ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక ఫాబ్రికేషన్ ఫ్యాక్టరీతో పాటు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశంపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది. ఈ ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీని విశాఖ లేదా కృష్ణపట్నం లో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎవర్సెండై చైర్మన్ వివరించారు. దాదాపు 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఎవర్సెండై ప్రతిపాదించింది. ఈ కొత్త ఫ్యాక్టరీను వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతంలో ఏర్పాటు చేసి దేశమంతటా ఫ్యాబ్రికేషన్ ఉపకరణాలను రవాణా చేసేందుకు వీలుగా ఎవర్సెండై ఆలోచన చేస్తోంది. ప్రతిపాదిత పెట్టుబడి ద్వారా రాష్ట్రానికి పరిశ్రమల్లో వృద్ధి, ఉద్యోగావకాశాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. అటు అమరావతి రాజధాని నిర్మాణంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ భాగస్వామ్యం అవుతామని ఎవర్సెండై ఆసక్తిని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీ సిటీ వంటి సంస్థలతో కలిసి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ సెంటర్ స్థాపనపైనా ఎవర్సెండై చైర్మన్ ముఖ్యమంత్రితో చర్చించారు. గతంలో బుర్జ్ ఖలీఫా, పెట్రోనాస్ టవర్ సహా చెన్నై లోని డీఎల్ఎఫ్ డౌన్ టౌన్ తారామణి ప్రాజెక్టు, గుజరాత్ లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఫ్యాబ్రికేషన్ పనుల్లోనూ పాల్గోన్నట్టు ఎవర్సెండై వివరించింది.