తృప్తి క్వాంటీన్లలో డ్వాక్రా మహిళలచే రుచికరమైన ఆహారం
తృప్తి క్వాంటీన్లలో డ్వాక్రా మహిళలచే రుచికరమైన ఆహారం
• పంజా సెంటర్ లో తృప్తి క్వాంటీన్లు ప్రారంభం
• డ్వాక్రా మహిళలను ఎంటర్ ప్రెన్యూర్స్ గా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
• పీ4 లో భాగంగా మహిళలచే తృప్తి క్యాంటీన్ల నిర్వహణ
ఎస్.సురేష్ కుమార్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి
రాష్ట్రంలోని పేద మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచి, స్వావలంబన సాధించే దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. శనివారం వన్ టౌన్ పంజా సెంటర్ లో తృప్తి క్యాంటీన్ ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎమ్ లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలగా ప్రోత్సహించేందుకు 'తృప్తి' క్యాంటీన్లను ప్రారంభించిందన్నారు. మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 750 క్యాంటీన్లను ప్రారంభించనున్నామన్నారు. ఇప్పటికే నెల్లూరులో తృప్తి క్వాంటీన్లను ఏర్పాటు చేస్తే అది దిగ్విజయంగా రోజుకు రూ. 10,000-15,000 వరకు ఆదాయం డ్వాక్రా మహిళలకు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 30 వేల మంది మెప్మా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మాకు లక్ష్యాన్ని ఇచ్చారని అందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న డ్వాక్రా మహిళలకు తృప్తి క్వాంటీన్ల నిర్వహణ బాధ్యతను అందిస్తున్నామన్నారు. నెల్లూరులో తొలి క్యాంటీన్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. తక్కువ ధరలకే ప్రజలకు భోజనం అందించడంతో పాటు మహిళలకు ఉపాధి కల్పించడమే ఈ క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమన్నారు. పట్టణ ప్రాంతాల్లో 28 లక్షల డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నాయని వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేవిధంగా చేయూతను అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళల రూ. 10 లక్షలు కంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. ఆ లక్ష్య సాధన దిశగా కృషి చేస్తూ, డ్వాక్రా మహిళల జీవనోపాధులు పెంచేలా కృషి చేస్తున్నామన్నారు.
నాణ్యతతో కూడిన ఆహార పదార్ధాలను తక్కువ ధరలకే ప్రజలకు ఆహారం అందించే లక్ష్యంతో తృప్తి క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. నగరంలో మరికొన్ని చోట్ల కూడా అన్న క్యాంటీన్ల మాదిరిగా తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పిస్తామన్నారు. జీఎస్టీ తో కలుపుకుని ప్రాజెక్ట్ వ్యయం రూ. 14,51,400 అవుతుందన్నారు. ఇందులో 75% డ్వాక్రా మహిళలు, 25% సారాస్ ఏజెన్సీ లోన్ ద్వారా సమకూర్చుతారన్నారు. ఆదాయం కూడా అదేవిధంగా పొందుతారన్నారు. నలుగురు మహిళా సభ్యులను ఒక యూనిట్గా ఏర్పాటు చేసి క్యాంటీన్లను అప్పగిస్తారన్నారు. క్యాంటీన్ నిర్వహణ కోసం కంటెయినర్ ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. పరోక్షంగా మరికొందరికి కూడా ఉపాధి లభిస్తుందన్నారు. వంట చేయడం, నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ అందిస్తామన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఆహారాన్ని తనిఖీ చేసి సూచనలు ఇస్తారన్నారు.. వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకొని క్యాంటీన్లను సమర్థవంతంగా నడిపిస్తారన్నారు. కస్టమర్లకు సంతృప్తి కలిగేలా ఆహారాన్ని అందిస్తారన్నారు. ఈ క్యాంటీన్లను ముఖ్యమైన కూడళ్లలో, హైవేలకు దగ్గరగా ఉన్న ప్రదేశాలలో ఏర్పాటు చేస్తారన్నారు. సారా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ పార్టనర్ జే. సాయినాధ్ వీటి నిర్వహణా బాధ్యతలు చూస్తారన్నారు.
మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త, ఒక ఉద్యోగి ఉండాలనే ముఖ్యమంత్రి కార్యాచరణకు అనుగుణంగా తృప్తి క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. 30,000 మంది డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా ఎదిగేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఫుడ్ సెక్టార్ లో మహిళలకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. తృప్తి క్యాంటీన్ల ప్రారంభంతో డ్వాక్రా మహిళలు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారన్నారని, వారు మంచి వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎమ్ మాట్లాడుతూ నగరంలో 11 అన్న క్వాంటీన్లు నడుస్తున్నాయని, వీటికి అనుగుణంగా డ్వాక్రా మహిళలతో నేడు తృప్తి క్వాంటీన్లు ప్రారంభించామన్నారు. ఈ క్వాంటీన్లలో రకరకాల ఫుడ్ ఐటెమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వీటిని తీసుకొస్తున్నమన్నారు. నగరంలో ఇంకా రెండు తృప్తి క్వాంటీన్లు రాబోతున్నాయన్నారు.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అందించిన రూ. 10,88,550 లోన్ చెక్ ను డ్వాక్రా మహిళలకు అందించారు. కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రీజినల్ మేనేజర్ హర్జిత్ సింగ్, డ్వాక్రా మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.