మార్గదర్శులుగా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు
మార్గదర్శులుగా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు
- బంగారు కుటుంబాలకు సాయం అందించాలని నిర్ణయం
- ‘జీరో పావర్టీ పీ4’ సమీక్షలో వెల్లడించిన సీఎం చంద్రబాబు
- రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు అందరూ కలిసిరావాలని ఆకాంక్ష
- రాష్ట్రంలో ఇప్పటివరకు 5,74,811 బంగారు కుటుంబాల దత్తత
అమరావతి, జూలై 25 : రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంకల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు...శుక్రవారం సచివాలయంలో జీరో పావర్టీ పీ4పై జరిగిన సమీక్షలో అధికారులకు స్పష్టం చేశారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగాస్వాములు అవుతారని చెప్పారు. అందరిలో చైతన్యం నింపేలా... మరింత మంది సంపన్నులు మార్గదర్శులుగా ముందుకు వచ్చేలా తన నిర్ణయం దోహద పడుతుందని అన్నారు. పీ4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని, పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దీనిని విజయవంతం చేసేందుకు అత్యుత్తమ విధానాలను అన్ని చోట్లా అమలు చేసి చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా... వారందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలని నిర్దేశించారు. ప్రవాసాంధ్రులను కూడా భాగస్వామం చేసేందుకు ఏపీ ఎన్నార్టీ సొసైటీ సాయం తీసుకోవాలని చెప్పారు. అలాగే కార్పొరేట్ సంస్థలు దీనికి కలిసి వచ్చేలా చూడటంతో పాటు వారితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లాల కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఆ ప్రాంతానికే చెందిన ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని సూచించారు. ఒకవేళ స్థానికంగా మార్గదర్శులు లేకపోతే అప్పుడు స్థానికేతరులను అనుసంధానం చేయాలని నిర్దేశించారు. పీ4 కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు రాష్ట్రస్థాయిలో దాతలు ముందుకు వస్తే వారిచ్చే నిధుల కోసం కామన్ ఫండ్ ఏర్పాటు చేయాలని, దాని ద్వారా బంగారు కుటుంబాలకు సాయం అందించవచ్చని సీఎం స్పష్టం చేశారు.
ఆగస్ట్ 10లోగా పీ4 ప్రాధాన్యతల సర్వే:
‘బంగారు కుటుంబాల అత్యంత ప్రాధాన్యతలపై చేపట్టిన సర్వేను ఆగస్ట్ 10లోగా పూర్తి చేయాలి. మార్గదర్శులు అందించే ఆర్ధిక, ఆర్ధికేతర సాయంపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ప్రతీ మార్గదర్శికి అధికారులు నమ్మకాన్ని కలిగించాలి. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో బంగారు కుటుంబాలు, మార్గదర్శుల వివరాలు సరిగ్గా నమోదు చేసినప్పుడే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. పీ4 నిర్వాహకులు, బంగారు కుటుంబాలకు ఆన్లైన్ ద్వారా అవగాహన కల్పించాలి.’ అని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు.
మార్గదర్శులుగా 57,503 మంది నమోదు
ఆగస్ట్ 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను ‘మార్గదర్శులు’ దత్తత తీసుకునేలా చూడాలని మరోసారి అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా, 57,503 మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని...మొత్తం లక్ష్యం నెరవేరాలంటే మరో 2 లక్షల మంది మార్గదర్శుల అవసరం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. పల్నాడు జిల్లా నుంచి అత్యధికంగా బంగారు కుటుంబాల దత్తత జరిగిందని..విశాఖపట్నం జిల్లా ఈ విషయంలో చివరిన ఉందని వెల్లడించారు. దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆటోమేటెడ్ మెసేజ్ రూపంలో సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియా, ఇతర ప్లాట్ ఫామ్ల ద్వారా పీ4 కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తలపెట్టిన డిజిటల్ ప్రమోషన్ కార్యకలాపాల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
3 విధానాల్లో జీరో పావర్టీ పీ4 అమలు
3 విధానాల్లో జీరో పావర్టీ పీ4ను అమలు జరుగుతోంది. బంగారు కుటుంబాన్ని మార్గదర్శి దత్తత తీసుకోవడం, వారికి ఆర్ధికేతర సాయాన్ని అందించటం మొదటి విధానం. దీనికి కాలపరిమితి అంటూ ఏమీ ఉండదు. రెండో విధానంలో ‘ఫండ్ ఏ నీడ్’, దీని కింద ఎవరికైతే ఆర్ధిక అవసరాలు ఉంటాయో వారికి నగదు సాయం అందించేలా కార్యాచరణ రూపొందించారు. అయితే దీనికి కాలపరిమితి ఉంటుంది. మూడో విధానంలో గ్రామాలను, మండలాలను దత్తత తీసుకోవడం...ఒక ప్రాంతంలో, ఒక ఊరిలో కమ్యూనిటీ అవసరాలు తీర్చడం, అక్కడ వివిధ అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేలా తీర్చిదిద్దారు. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి ఈ మూడో విధానం అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు...పీ4కి భాగస్వాములుగా వ్యవహరిస్తున్న కేపీఎంజీ, మిలాప్, తమ్మడ, భవ్య, భార్గో, ప్రాజెక్ట్ డీప్ సంస్థలు మరింత కీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒక బంగారు కుటుంబానికి అవసరమైతే ఒకరికి మించి మార్గదర్శులు సాయం అందించేలా చూడాలన్నారు.