మైనారిటీలకు, బీసీ లకు బడ్జెట్ లేకుండా చేసింది ఎవరు..!
మైనారిటీలకు, బీసీ లకు బడ్జెట్ లేకుండా చేసింది ఎవరు..!
- బడ్జెట్ ను నాశనం చేసింది మీరే..!!
- ఐదేళ్లలో మైనారిటీలకు ఒక్క రూపాయి కూడా రుణాలు ఇవ్వనివారు ప్రశ్నించడమా..!
- శాసనమండలిలో వైసిపి ఎమ్మెల్సీలకు చురకలంటించిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్
- మైనారిటీ సంక్షేమ పథకాలకు ఆద్యులు ఎన్టీఆర్,చంద్రబాబు
- ఇమాములు, మౌజన్ లకు గౌరవ వేతనాలు ప్రవేశ పెట్టిన ఘనత చంద్రబాబుదే
- శాసనమండలి సమావేశంలో మంత్రి ఫరూక్ స్పష్ఠీకరణ
అమరావతి సెప్టెంబరు 23
"మైనారిటీలకు, బీసీ లకు బడ్జెట్ లేకుండా చేసిందెవరు.. బడ్జెట్ లేకుండా సంక్షేమ కార్యక్రమాల్లో కలిపేసింది మీరు..బడ్జెట్ ను నాశనం చేసింది మీరు" అంటూ రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శాసనమండలిలో వైసిపి ఎమ్మెల్సీలకు తనదైన శైలిలో చురకలంటించారు. మంగళవారం జరిగిన శాసనమండలి సమావేశంలో వైసిపి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మైనారిటీల కు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, వక్ఫ్ బోర్డు,ఉర్దూ అకాడమీ తదితర అంశాలకు సంబంధించి ప్రశ్నలు లేవనెత్తారు.వైసిపి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘాటుగా సమాధానం ఇస్తూ, ఐదేళ్ల వైసిపి ప్రభుత్వం లో మైనారిటీలకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ చురకలంటించారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని, ఎన్టీఆర్, చంద్రబాబుల తోనే మైనారిటీల సంక్షేమానికి పునాదులు పడ్డాయని మంత్రి ఫరూక్ అన్నారు. అప్పటి వరకు మైనారిటీలకు ఒక్క రూపాయి ఏమైనా ఉన్నదా..? బడ్జెట్ ఏమైనా కేటాయించారా..? ఇమాములు, మౌజన్లకు గౌరవ వేతనాలు ప్రవేశపెట్టిందే చంద్రబాబు..! మీరేమైనా పెట్టారా..? రూపాయి ఇచ్చారా..? అంటూ వైసిపి ఎమ్మెల్సీ లపై మంత్రి ఫరూక్ విరుచుకుపడ్డారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2014-19 లో 86,332 మంది కి రుణ సాయం అందించడం జరిగిందని, 2019-2024 మధ్య ఐదేళ్లలో మైనారిటీ లబ్ధిదారులకు రూపాయి కూడా ఇవ్వలేదని.. ఇది రికార్డెడ్.. కావాలంటే మీకు పంపిస్తా.. చూడండి అంటూ వైసీపీ సభ్యులకు అధికారిక లెక్కల పత్రాలను చూపిస్తూ మంత్రి ఫరూక్ చురకలాంటించారు.వక్ఫ్ బోర్డును వేయడం జరిగిందని, సెంట్రల్ యాక్ట్ వచ్చినా వక్ఫ్ బోర్డును చంద్రబాబు ధైర్యంగా వేశారని, దేశంలో ఎవరూ వెయ్యలేదని, వక్ఫ్ బోర్డును స్ట్రీమ్ లైన్ చేసిందే మేము.. ఇమాములు,మౌజనులు, పాస్టర్లకు గౌరవ వేతనాలు ఇచ్చాం.. ఇవన్నీ మేమే చేశాం.. మీరేమైనా చేశారా..?? వాస్తవాలను గుర్తించాలని వైసిపి ఎమ్మెల్సీలను ఉద్దేశించి మైనారిటీ మంత్రి ఫరూక్ ఘాటుగా హితవు పలికారు.ప్రస్తుత ఏడాదిలో 86,000 కు పైగా దరఖాస్తులు రుణాల కోసం వచ్చాయని,19,790 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించడం జరిగిందని, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి అందరికీ రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు.
