ప్రజలకు మంచి సేవలు అందించాలి
ప్రజలకు మంచి సేవలు అందించాలి
రాష్ట్ర చరిత్రలో ఈరోజు ఓ శుభ దినం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గ్రామ స్థాయి నుంచి రెవెన్యూ వ్యవస్థను పునర్య్వవస్థకరించేందుకు 10954 గ్రామాలను 6860 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి గ్రామ పాలనాధికారులను (జి.పి.వో) నియమించాం.
ఈరోజు 5106 మంది గ్రామ పాలనాధికారులకు హైదరాబాద్ లోని మాదాపూర్ హైటెక్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ , సహచర మంత్రి సీతక్క , శాసన మండలి విప్ మహేందర్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ర రెడ్డి , పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, కార్పేరేషన్ల ఛైర్మన్లు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ , సంబంధిత ఉన్నతాధికారుల సమక్షంలో గ్రామ పాలనాధికారుల (జి.పి.వో) కు నియామక పత్రాలు అందజేయడం జరిగింది.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వార్ధ ప్రయోజనం కోసం రాత్రికి రాత్రే ఒక్క కలం పోటుతో వి.ఆర్.వో, వి.ఆర్.ఎ. వ్యవస్థను రద్దు చేసి భయంకరమైన ధరణి పోర్టల్ ను తీసుకొచ్చారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకపోవడంతో రైతులు, ఆసాములు ఎంతో ఇబ్బందులు పడ్డారు. గ్రామ పాలనా వ్యవస్థ కుంటు పడింది. ఆ కష్టాలను మేము ప్రత్యక్షంగా చూశాము. మేము అధికారంలోకి వస్తే ధరణి ని రద్దు చేస్తామని మా అగ్రనేత రాహుల్ గాంధీ , నాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా అందరం ఎన్నికల్లో హామీ ఇచ్చాం. మా హామీపై విశ్వాసం ఉంచి, ప్రజలు ఇచ్చిన దీవెనలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ధరణితో ఇబ్బందులు పడ్డ రైతులను విముక్తి చేసేందుకు, ప్రజలకు ఉపయోగపడే చట్టాలను తీసుకురావాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేశాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , కేబినెట్ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సూచనలతో 90 రోజుల్లో విధి విధానాలు రూపొందించి భూ భారతి చట్టం తీసుకొచ్చాం.
భూ భారతి చట్టాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా మొదటి ఐదు మండలాల్లో అమలు చేసి సత్ఫలితాలు ఇవ్వడంతో జూన్ 2 న రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చాం. గతంలో మాదిరిగా రైతులు చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరగకుండా అధికారులే గ్రామాలకు వెళ్లి రైతుల దగ్గర దరఖాస్తులు స్వీకరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం 8లక్షల 65వేల మంది రైతులు దరఖాస్తులు ఇచ్చారు. వీటిలో కొన్నింటిని అధికారులు పరిష్కరించారు. ఇవిగాక 9,26,000 సాదా బైనామా దరఖాస్తులున్నాయి. గత ప్రభుత్వం సాదా బైనాలకు దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించకపోవడంతో కొందరు రైతులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో హైకోర్టు స్టే విధించింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో హైకోర్టులో ఉన్న స్టే ను వెకేట్ చేయించడం జరిగింది.
రెవెన్యూ వ్యవస్థలో సర్వేయర్లు లేకపోవడం చాలా భూవివాదాలకు ప్రధాన కారణం . దీనిపై కూడా అద్యయనం చేసి ప్రస్తుతమున్న సర్వేయర్లకు తోడు రాబోయే ఉగాది నాటికి 7000 మంది లైసెన్స్ డ్ సర్వేయర్లను నియమిస్తాం. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ప్రాజెక్ట్ ల నిర్మాణంలో రైతులు భూములు ఇచ్చినప్పటికీ రికార్డుల్లో ఇప్పటికీ ఆ రైతుల పేర్లు ఉన్నాయి. భూ భారతి చట్టం ద్వారా ఇకపై ఏ గ్రామంలో క్రయ విక్రయాలు జరిగినా ప్రతి కాపీని రెవెన్యూ రికార్డుల్లో భద్రపరుస్తారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతారు.
‘గ్రామ పాలనాధికారిగా, ప్రజా ప్రభుత్వంలో, ప్రజా సేవకు ప్రభుత్వం కల్పించిన ఒక గొప్ప భూ సంబంధిత విధి నిర్వాహణలో పారదర్శకతతో, నిబద్ధతతో న్యాయ బద్దంగా పని చేస్తానని, 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతిజ్ఞ చేస్తున్నాను‘ అంటూ గ్రామ పాలనాధికారుల చేత ప్రతిజ్ణ చేయించడం జరిగింది.
బాధ్యతాయుతమైన విధుల్లో చేరుతున్న గ్రామ పాలనాధికారులు ప్రజలకు మంచి సేవలు అందిస్తూ, ప్రభుత్వానికి చిన్న మచ్చ రాకుండా కృషి చేయాలని కోరుకుంటున్నాను.
