రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పర్యాటకాంధ్రప్రదేశ్ గా ఏపీ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

పర్యాటకాంధ్రప్రదేశ్ గా ఏపీ

  • శాసనమండలిలో స్పష్టం చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
  • 15 నెలల కాలంలో రూ.10,644 కోట్ల పర్యాటక పెట్టుబడులు, 103 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని వెల్లడి
  • పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని స్పష్టం
  • నూతన పర్యాటక పాలసీ 2024-29లో భాగంగా ల్యాండ్ అలాట్ మెంట్, క్యారవాన్ టూరిజం, హోమ్ స్టే పాలసీలు తీసుకొచ్చామని పేర్కొన్న మంత్రి దుర్గేష్
  • రాష్ట్రంలోని 100 పుణ్యక్షేత్రాల్లో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్
  • 2019-24 కాలంలో గత ప్రభుత్వం కేవలం రెండు ప్రాజెక్టులు మాత్రమే చేపట్టిందని స్పష్టం..అందులో ఒకటి రుషికొండ రాజప్రాసాదమని పేర్కొన్న మంత్రి దుర్గేష్
  • గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం పర్యాటక రంగంపై ఏమాత్రం దృష్టిపెట్టలేదని విమర్శించిన మంత్రి కందుల దుర్గేష్


అమరావతి: 15 నెలల కాలంలో రూ.10,644 కోట్ల పర్యాటక పెట్టుబడులు, 103 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బుధవారం శాసనమండలిలో పర్యాటక రంగంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి కందుల దుర్గేష్ స్పష్టమైన సమాధానాలతో కూడిన వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఏమన్నారంటే..

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో 2024-29కి నూతన పర్యాటక పాలసీ తీసుకొచ్చాం. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కలను సాకారం చేసింది కూటమి ప్రభుత్వం. పారిశ్రామిక రాయితీలు అనుసరించి కేపిటల్ ఇన్సెంటివ్స్, పవర్ ఛార్జీలు, ఎస్జీఎస్టీ తదితర అంశాల్లో రీయింబర్స్ మెంట్ ఇవ్వడం వల్ల 15 నెలల కాలంలో రూ.10,644 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి 103 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నాం.తద్వారా 8080 గదులు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎంవోయూలు చేసుకున్న దాంట్లో రూ.3887 కోట్లతో 15 ప్రాజెక్టుల ద్వారా 2848 గదులు ఏర్పాటు చేసుకునేందుకు అడుగులు పడ్డాయి. అదే విధంగా రూ.3668 కోట్లతో 24 ప్రతిపాదనలకు సంబంధించి డీపీఆర్ లు అందాయి. తద్వారా మరో 3164 గదులు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. పర్యాటక రంగాన్ని ఏపీలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో టూరిజం సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఎకో, అడ్వెంచర్, వెల్ నెస్, హెలీ టూరిజం లను ప్రవేశపెడుతున్నాం. టూరిజం ప్రాజెక్టులకు ఎంవోయూలు కుదుర్చుకోవడమే గాదు ఆచరణలోకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో ప్రాంతీయ పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించాం. పీపీపీ విధానంలో హోటళ్లు నిర్మించేందుకు నిర్ణయించాం. పర్యాటక రంగాన్ని వృద్ధి చేసేందుకు ప్రత్యేక విధానంతో ముందుకు వెళ్తున్నాం. గత ప్రభుత్వంలో మాదిరి డబ్బును ఒకే చోట రాజప్రాసాదాలలో కేంద్రీకరించకుండా సరైన విధాన రూపకల్పనతో అన్ని ప్రాంతాలకు వెచ్చిస్తున్నాం. నూతన పర్యాటక పాలసీలో భాగంగా ల్యాండ్ అలాట్ మెంట్ పాలసీ ద్వారా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశాం. ఎక్కడెక్కడ టూరిజం డిపార్ట్ మెంట్ కు ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ పార్సిల్స్ ను టూరిజం వెబ్ సైట్ లో పారదర్శకంగా అందుబాటులో ఉంచాం.పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందం చేసుకున్న సంస్థలకు ల్యాండ్ పార్సిల్స్ కేటాయించే అవకాశం కల్పించాం.హోమ్ స్టే పాలసీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మండువాలోగిళ్లను,పురాతన కట్టడాల్లో పర్యాటకులకు విడిది కల్పించే చర్యలు చేపట్టాం. తద్వారా విదేశీ పర్యాటకులను ఆకర్షించాలని భావిస్తున్నాం. త్వరలోనే హోమ్ స్టే పాలసీ తీసుకొస్తున్నాం.గత ప్రభుత్వం హోమ్ స్టే గురించి ఆలోచించిన పాపాన పోలేదు. కొన్ని పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్లు నిర్మించే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ క్రమంలో పర్యాటకులు తిరగడానికి, స్టే చేసేందుకు క్యారవాన్ టూరిజం పాలసీ తీసుకొచ్చాం. ఈ క్రమంలోనే విశాఖలో 2 హాప్ ఆన్ హాప్ ఆప్ డబుల్ డెక్కర్ బస్సులను ఏర్పాటు చేసి 11 ప్రాంతాలు పర్యాటకులు సందర్శించేందుకు అందుబాటులోకి తీసుకొచ్చాం.కేవలం రూ.250 టికెట్ తో 24 గంటలు ఆయా ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించాం. ఉత్తర ప్రదేశ్ లో కుంభమేళా జరిగిన సమయంలో టెంట్ సిటీలు కీలక పాత్ర పోషించాయి. ఈ క్రమంలో ఏపీలోని 100 పుణ్యక్షేత్రాల్లో టెంట్ సిటీలు ఏర్పాటు చేసేందుకు సంకల్పించాం. ఒక దేవాలయానికి దర్శనానికి వచ్చిన భక్తుడు రెండు మూడు రోజులు సమీప ప్రాంతాలను సందర్శించేందుకు వీలు కలిగేందుకు చర్యలు తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వివిధ పథకాల ద్వారా రూ.441 కోట్ల నిధులతో అఖండ గోదావరి, గండికోట, సూర్యలంక బీచ్, అన్నవరం, సింహాచలం, అహోబిలం, అన్నవరం, నాగార్జునసాగర్ తదితర పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నాం. అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా రాజమహేంద్రవరం సమీపంలోని గోదావరి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. అందులో భాగంగా పురాతన హేవలాక్ బ్రిడ్జిని ఆధునికీకరిస్తూ అందంగా తీర్చిదిద్దుతున్నాం. సందర్శకుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. పనులు ప్రారంభమయ్యాయి. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన గండికోట దగ్గర అద్భుత సాహస పర్యాటకాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగంపై ఎంత దృష్టి పెడుతోందనడానికి ఇదే నిదర్శనం.. రాబోయే నాలుగేళ్ల కాలంలో 50వేల గదుల ఏర్పాటే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ఏపీని పర్యాటకాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. పర్యాటక రంగం ద్వారా ప్రజలకు ఆహ్లాదం, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆ దిశగా చర్యలు చేపట్టాం అన్నారు.

గత ప్రభుత్వంలో పర్యాటకాభివృద్ధి శూన్యం:మంత్రి కందుల దుర్గేష్

2019-24 మధ్య పర్యాటక శాఖ కేవలం 2 ప్రాజెక్టులను మాత్రమే చేపట్టిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అందులో ఒకటి అల్లూరి సీతారామరాజు పుట్టిన పాండ్రంగి గ్రామం వద్ద అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించి ఖర్చు చేశారు.రూ.451 కోట్లతో విశాఖ పట్నం జిల్లా రుషికొండ వద్ద రాజప్రాసాదాన్ని నిర్మించారు. ఇవి రెండు గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు అని తెలిపారు. 2019-24లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒకే ఒక ప్రాజెక్టు మంజూరైనది. రూ.54 కోట్ల వ్యయంతో ప్రసాద్ పథకం క్రింద విశాఖపట్నంలోని  వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో తీర్థయాత్రికుల సౌకర్యార్థం చేపట్టారని వెల్లడించారు.పైన పేర్కొన్న ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ.438.86 కోట్ల నిధులు ఖర్చు కాగా ఇందులో కేవలం రూ.2 కోట్లు మాత్రమే అల్లూరి సీతారామ రాజు గ్రామానికి ఖర్చుపెట్టారు. మిగతా డబ్బు అంతా రుషికొండ రాజప్రాసాదానికే ఖర్చు చేశారని మంత్రి దుర్గేష్ విమర్శించారు. 2019-24 కాలంలో ప్రైవేట్ పార్టీలకు ఆపరేషన్స్ అండ్ మేనేజ్ మెంట్ కార్యకలాపాలపై ఏపీటీడీసీ హోటళ్లు, రెస్టారెంట్లు, షాపులు, లైట్ అండ్ సౌండ్ షో వంటి 50 ఆస్తులను ఇవ్వడమైందన్నారు. ఉదాహరణకు తిరుపతి, పలమనేరు, మైపాడు, గోపవరం మొదలైన ప్రాంతాల్లో హోటళ్లను ఇచ్చారని తెలిపారు. 2019-24 వరకు జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎక్కడా పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టలేదని మంత్రి దుర్గేష్ శాసన మండలిలో స్పష్టం చేశారు.

Comments

-Advertisement-