మంత్రి నారా లోకేష్ చొరవతో సురక్షితంగా బయటపడ్డ నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారు
మంత్రి నారా లోకేష్ చొరవతో సురక్షితంగా బయటపడ్డ నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారు
- ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన 144 మంది
- బీహార్ సరిహద్దు ద్వారా భారత్ లోకి ప్రవేశించిన 22 మంది
- సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా భారత సరిహద్దులోని నేపాల్ గంజ్ కు చేరుకున్న 12 మంది
- నేపాల్ లో చిక్కుకున్న ప్రతి తెలుగువారిని రక్షించేవరకు కొనసాగనున్న హెల్ప్ లైన్ సెంటర్
అమరావతిః నేపాల్ దేశంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ చూపిన ప్రత్యేక చొరవ ఫలించింది. గత రెండు రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం, నేపాల్ రాయబార కార్యాలయం, రాష్ట్రానికి చెందిన మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఖాట్మాండూ, హేటౌడా, పోఖరా, సిమికోట్ తదితర ప్రాంతాల్లో తెలుగువారు తలదాచుకున్నారు. వీరందరినీ ప్రత్యేక విమానాలు, రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. మంత్రి లోకేష్ కృషి కారణంగా నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు సురక్షితంగా బయటపడ్డారు.
ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన 144 మంది ఏపీ వాసులు
ఇప్పటికే ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానంలో 144 మంది బయలుదేరారు. వీరిలో 104 మంది విశాఖ విమానాశ్రయానికి చేరుకోనుండగా.. మరో 40 మంది తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. విశాఖ, తిరుపతి విమానాశ్రయాల్లో తెలుగువారికి స్వాగతం పలకాలని మంత్రి లోకేష్ కూటమి ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా విమానాశ్రయాల నుంచి వారిని స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు నేపాల్ లోని హేటౌడా నుంచి బస్సులో బయలుదేరిన 22 మంది తెలుగువారు బీహార్ సరిహద్దు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారు. అటు నేపాల్ సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా 12 మందిని భారత సరిహద్దులోని నేపాల్ గంజ్ కు తరలించారు. అక్కడి నుంచి వీరిని వాహనాల ద్వారా లక్నోకు తరలించారు. లక్నో నుంచి ప్రత్యేక విమానంలో వీరు రాష్ట్రానికి చేరుకోనున్నారు. నేపాల్ లో చిక్కుకున్న ప్రతి తెలుగువ్యక్తిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే బాధ్యత తీసుకున్న మంత్రి లోకేష్ కు ఈ సందర్భంగా ఏపీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.
చివరి తెలుగు వ్యక్తిని రాష్ట్రానికి తీసుకువచ్చే వరకు కొనసాగనున్న హెల్ప్ లైన్ సెంటర్
నేపాల్ లో చిక్కుకున్న చివరి తెలుగు వ్యక్తిని రాష్ట్రానికి సురక్షితంగా తీసుకువచ్చేంత వరకు ఏపీ భవన్, ఆర్టీజీఎస్ కేంద్రంలో ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ సెంటర్ కొనసాగనుంది. వారిని తీసుకువచ్చే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకోనుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగింది.