మాననీయ కోణంలో పని చేయండి క్షేత్ర స్థాయిలో పర్యటించండి
మాననీయ కోణంలో పని చేయండి
క్షేత్ర స్థాయిలో పర్యటించండి
- డబుల్ ఇంజిన్ సర్కార్.... డబుల్ డిజిట్ గ్రోత్
- వారసత్వ ఆస్తులను ఆక్రమించే
- వాళ్ల ఆటలు కట్టించాలి
- జీఎస్టీ సంస్కరణల ఫలాలు అందరికీ అందాలి
- నాలుగో కలెక్టర్ల కాన్ఫరెన్స్ తొలి రోజు సమావేశంలో సీఎం దిశా నిర్దేశం
- కొత్తగా నియమితులైన కలెక్టర్లకు ప్రజల తరపున అభినందనలు తెలిపిన సీఎం
అమరావతి, సెప్టెంబర్ 15:
కలెక్టర్లు, అధికారులు మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆఫీసులో కూర్చొని పేపర్ మీద చూస్తే అంతా చక్కగా ఉంటుంది.. సవ్యంగానే కన్పిస్తుంది. క్షేత్ర స్థాయిలో పర్యటించాలి. వాస్తవాలు గ్రహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. సచివాలయంలోని ఐదో బ్లాకులో సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం అయింది. తొలి రోజున వివిధ అంశాలపై చర్చించారు. జిల్లాల్లో ప్రగతి, సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించడంతో పాటు... కేటగిరీల వారీగా శాఖలపై సీఎం సమీక్షించారు. లాజిస్టిక్స్, ఇన్ఫ్రా, స్వచ్ఛాంధ్ర, సర్కులర్ ఎకానమీ వంటి అంశాలపై చర్చించారు. సూపర్ సిక్స్, పీ4 అమలు వంటి అంశాల అమలు ఏ విధంగా జరుగుతున్నాయోననే అంశాన్ని కలెక్టర్లకు వివరించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని, అలాగే జీఎస్డీపీ గ్రోత్ వంటి అంశాలపై సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”కొత్తగా నియమితులైన కలెక్టర్లకు ప్రజలు, కెేబినెట్ తరపున శుభాభినందనలు. కలెక్టర్లు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులు. జిల్లా రూపు రేఖల్ని మార్చటంలో వారిదే ప్రధాన బాధ్యత. ప్రభుత్వం రూపొందించిన విధానాలను సక్రమంగా అమలు చేసేది కలెక్టర్లే. సీఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకూ సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతో నియమాకాలు చేశాం. అన్ని కోణాల్లో ఆలోచించి ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపిక, కేబినెట్ కూర్పు చేశాం. అదే తరహాలో సమర్థులైన వారి కోసం కలెక్టర్ల పోస్టింగులు చేపట్టాం. దీనికి అనుగుణంగా పని చేయాలి. మంచి పేరు తెచ్చుకునేలా కలెక్టర్లు పని చేయాలి. పని తీరు చక్కగా ఉన్నవాళ్లను నేను ఎప్పుడూ మార్చలేదు. ప్రభుత్వం అందించే సేవలన్నిటిలోనూ సంతృప్త స్థాయే కొలమానం అవుతుంది. సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తారో... శాంతి భద్రతల విషయంలో కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ పని చేసిన అధికారులు ఆర్బీఐ లాంటి సంస్థలకు వెళ్లారు. నేను అధికారులకు పూర్తిగా సపోర్ట్ అందిస్తాను. కానీ విఫలమైతే మాత్రం కఠినంగానే నిర్ణయాలు తీసుకుంటా. కలెక్టర్ల సదస్సు కొత్త ట్రెండ్ను సృష్టించాలని కోరుతున్నాను.” అని సీఎం చెప్పారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత మాది... మీది
ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం. అందరినీ సాధికారిత దిశగా నడిపిస్తామని చెప్పిన హామీని విశ్వసించే ఎన్డీఏ కూటమికి 94 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సంక్షేమం అమలు చేస్తామని చెప్పాం. కలెక్టర్లు, అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి. చెప్పినట్టుగా సూపర్ సిక్స్ను సక్సెస్ చేశాం. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం పెన్షన్లు. 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్ధికి ఆర్ధిక సాయం చేస్తున్నాం. విద్యార్ధులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్లే పరిస్థితులు వచ్చాయి. ఉచిత బస్సు అమలు చేయలేమని కొందరు విమర్శించారు. కానీ స్త్రీశక్తి పథకం సక్సెస్ అయింది. 50 శాతం మహిళల్ని వంటింటికే పరిమితం చేస్తే వారి శక్తియుక్తులు వృధా అవుతున్నాయి. రాష్ట్రాభివృద్ధికి మహిళా శక్తి కీలకం. ఉచిత బస్సు ప్రయాణం-స్త్రీశక్తి పథకం ఆర్ధిక వ్యవస్థలో చాలా మార్పు తెస్తుంది. పథకం అమలు తర్వాత 90 శాతం మేర ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెరిగింది. ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నా. దీపం2 పథకం ద్వారా ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి విడతలో రూ.7 వేలు ఇచ్చాం. ఆటో డ్రైవర్లకు కూడా రూ.15 వేలను అక్టోబరు 1 తేదీన ఇస్తాం. సమాజంలోని అన్ని వర్గాలకూ అవకాశాలు రావాలి... ప్రతిఫలాలు అందాలి. గతంలో గడ్డు పరిస్థితుల్లో ఉన్న రాయలసీమ... ఇప్పుడు కోనసీమతో సమానంగా ఉంది. రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లాంటి విధానాలతో సమర్ధనీటి నిర్వహణ ద్వారా మంచి ఫలితాలు సాధించాం. పట్టిసీమతో డెల్టాలో వాడే కృష్ణానీటిని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగాం. ప్రస్తుతం హంద్రీనీవా ప్రధాన కాలువను 100 రోజుల్లో పూర్తి చేసి కుప్పం వరకూ కృష్ణా నీళ్లు తీసుకెళ్లాం. గోదావరిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయి. సమర్ధ నీటి నిర్వహణతో రిజర్వాయర్లు నింపాం. వాణిజ్య పంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలి.” అని సీఎం వివరించారు.
జీఎస్టీ సంస్కరణలపై క్షేత్రస్థాయి ప్రచారం
విజన్ డాక్యుమెంటే... భగవద్గీత, ఖురాన్, బైబిల్
డబుల్ ఇంజన్ సర్కార్- డబుల్ డిజిట్ గ్రోత్ ఉండాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నాం. 2047 వరకూ 15 శాతం వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. ప్రస్తుతం వృద్ధిరేటు 10.5 శాతం ఉంది. ఈ ఏడాది తలసరి ఆదాయాన్ని రూ.3.47 లక్షలకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. 2029 నాటికి రూ.29 లక్షల జీఎస్డీపీ లక్ష్యం. అప్పటికి రూ.4.67 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా మనం పని చేయాలి. భారత్ నెంబర్ 1 కావాలన్న ఆకాంక్షతోనే ప్రధాని మోదీ పని చేస్తున్నారు. భారత ఆర్ధిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4 స్థానానికి చేరుకుంది. మరో 22 ఏళ్లలో స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తి అవుతుంది. ఆ సమయానికి భారత్ కూడా అగ్రస్థానానికి చేరుకుంటుంది. కేంద్రం 2047 వికసిత్ భారత్ ప్రణాళిక తయారు చేస్తే... ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపొందించింది. ఇది అధికారులందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలి. భారత్ అభివృద్ధికి తోడుగా ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రస్థానానికి ఎదగాలి.” అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కలెక్టర్ల సమావేశంలో మంత్రులు, సీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.