కృష్ణా నదిపై హై లెవల్ వంతెనతో దీవుల అనుసంధానం
కృష్ణా నదిపై హై లెవల్ వంతెనతో దీవుల అనుసంధానం
– ఎదురుమొండి ప్రజల కల నెరవేరుస్తామని హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
- గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రూ.50 కోట్ల అదనపు భారం
- రహదారులు–అటవీ అనుమతులపై దిశానిర్దేశం
మంగళగిరి, నవంబర్ 5 (పీపుల్స్ మోటివేషన్): కృష్ణా నదిపై నిర్మించనున్న హై లెవల్ వంతెన ద్వారా ఎదురుమొండి దీవుల్లో నివసించే ప్రజలకు రాకపోకలలో ఏర్పడుతున్న తీవ్ర సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవనిగడ్డ నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాలు, పంట నష్టం, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి తదితర అంశాలను విశ్లేషించారు. సమావేశంలో పాల్గొన్న మాచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. మోతా తుపాను కారణంగా తీర ప్రాంత గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయని, పంట నష్టం అంచనాలు వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు కౌలు రైతులకు కూడా న్యాయం జరుగాలి అని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలోనే 60 వేలకు పైగా సీసీ ఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ, నమోదు కాని కౌలు రైతులను కూడా గుర్తించి సహాయం అందించాలన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అవనిగడ్డ పరిధిలో కాలువలను సముద్రంతో అనుసంధానించే అవుట్ ఫాల్ స్లూయిజ్లు పనులు చేయకపోవడం వల్ల నాగాయలంక, కోడూరు ప్రాంతాల్లో ప్రతి ఏడాది వేల ఎకరాలు ముంపుకు గురయ్యాయన్నారు. నిర్వహణ లోపంతో ఇవి పనిచేయకుండా ఉండిపోయాయనీ, ఇప్పుడు పునర్నిర్మాణానికి రూ.50 కోట్లు అవసరమవుతున్నాయన్నారు. మొత్తం ఏడు అవుట్ ఫాల్ స్లూయిజ్లను పునర్నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జాతీయ విపత్తు నిర్వహణ నిధుల నుంచి ఆర్థిక సహాయం పొందేలా కేంద్రాన్ని సంప్రదిస్తామని తెలిపారు.
- ఎదురుమొండి.. ఏటిమొగ వంతెనకు హామీ
ఎదురుమొండి దీవుల్లో నివసిస్తున్న 20 వేల మంది ప్రజల సంవత్సరాల నాటి డిమాండ్ అయిన ఏటిమొగ–ఎదురుమొండి హై లెవల్ వంతెన నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుందని పవన్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.109 కోట్ల నాబార్డు నిధులు మంజూరయ్యాయని, అయితే అలైన్మెంట్ మార్పుల కారణంగా వ్యయం మరో రూ.60 కోట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. రాష్ట్ర నిధులతో పాటు సాస్కీ పథకం ద్వారా కూడా నిధులు సమకూర్చి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
- రహదారులు–అటవీ అనుమతులపై దిశానిర్దేశం
ఎదురుమొండి–గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.88 కోట్లు మంజూరై, టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. అయితే అటవీ భూభాగం కారణంగా నిలిచిపోయిన అనుమతులను త్వరితగతిన పరిష్కరించేందుకు అటవీ శాఖ, కలెక్టర్ కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేసి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాలని ఆదేశించారు. హంసలదీవిలో సాగర సంగమం దర్శనానికి వెళ్లే భక్తులపై వసూలు చేస్తున్న అటవీ శాఖ రుసుమును పునర్విభజించాలని సూచించారు. “భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అటవీ శాఖ ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాలి” అని తెలిపారు.
సమీక్షలో రోడ్లు & భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, నీటిపారుదల, అటవీ, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

