గిరిజ తెగలు స్వచ్ఛమైన మనస్సుకు, సంస్కృతికి వారసులు
గిరిజ తెగలు స్వచ్ఛమైన మనస్సుకు, సంస్కృతికి వారసులు
- వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్
రాష్ట్ర ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ గా సోళ్ల బొజ్జి రెడ్డి, సభ్యులు సోమవారం ఆర్ అండ్ బీ బిల్డింగ్స్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక తుమ్మలపల్లి కళా క్షేత్రంలో గిరిజన సంస్కృతీ, ఆచారాలతో కూడిన అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్. జవహర్, శాసన సభ్యులు మిరియాల శిరీష లు హాజరయ్యారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ గా భాద్యతలు చేపట్టిన సోళ్ల బొజ్జి రెడ్డికి, మరియు కమిషన్ సభ్యులుగా భాద్యతలు చేపట్టిన జీ. సునీత, కే. లక్ష్మి, కే. సాయిరాం, కే. మల్లేశ్వర రావు, వెంకటప్ప లకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తారని దృఢంగా విశ్వసిస్తున్నానన్నారు. షెడ్యూల్డు కులాలు మరియు తెగల సంక్షేమానికి అన్ని విధాల చైర్మన్, సభ్యులు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన దుశ్చర్యలను, దుష్ట సంస్కృతిని గుర్తు చేసుకోవాలని అప్పుడే భవిష్యత్తులో అటువంటి దుశ్చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా కాపాడుకునే అవకాశం కలుగుతుందన్నారు.
షెడ్యూల్డు కులాలు, తెగలను మరియు వెనుకబడిన తరగతుల వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ లపై ఉందన్నారు. దాదాపు 7 శాతం జనాభా కలిగిన ఎస్టీలకి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉండాలని కూడా ఎప్పుడూ ఎవరూ ఆలోచించలేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1999 లో ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో కేంద్రం స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు తొలిసారి షెడ్యూల్ కులాలకు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసారన్నారు. 1947 లో స్వాతంత్రం వస్తే 1999 వరకు ఈ అంశంపై ఏ అధికార పార్టీ ఆలోచించలేదన్నారు. షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలపై జరుగుతున్న దోపిడిని ఎదుర్కోవడానికి 2003 లో 89 వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి, ఎస్టీ కమిషన్ ని ప్రత్యేకం చేసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ తీసుకొచ్చి ఎస్టీల మీద ఎక్కడైనా అన్యాయం జరిగినా, దౌపీడి, దౌర్జన్యం జరిగినా వారి పై చర్యలు తీసుకునే బాధ్యతను ఎస్టీ కమిషన్ కు అందించారన్నారు.
గిరిజన తెగ నాయకులు, స్వాతంత్ర్య సమర యోధుడు బిర్సా ముండా 151 వ జయంతి సందర్భంగా 15 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారన్నారు. బిర్సా ముండా 25 ఏళ్ల వయసులోనే స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడి, భూస్వాములతో కూడా పోరాడి, జైల్లో హత్యగా గురింపబడ్డారన్నారు. నవంబర్ 15 ఆయన జయంతిని జన జాతి గౌరవ దివస్ గా ప్రకటించి ఇవాళ దేశంలో ఉంటున్న దాదాపు 11 కోట్ల మంది ఆదివాసీలకి గౌరవం కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ చేసారన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ మరియు వికసిత భారత్ నిర్మాణంలో గిరిజనులు ముఖ్య భూమిక వహించాలనే సంకల్పంతో గిరిజనుల అభివృద్ధి కి బడ్జెట్ లో కేటాయింపులు పెంచారన్నారు. 2013-14 లో కేవలం రూ. 4,200 కోట్లు బడ్జెట్ కేటాయింపులు ఉంటే 2025- 26 కి రూ. 14,956 కోట్లు పెరిగిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, గృహాలు,మరుగుదొడ్లు, ఆస్పత్రుల నిర్మాణాలు చేయడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాన్ని పెంచి వారి పిల్లలకి ఉద్యోగ భవిష్యత్తు కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అంతే కాకుండా గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి నాణ్యమైన విద్య అందించేందుకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2014 సంవత్సరానికి కేవలం 119 మాత్రమే ఉంటే 5 సంవత్సరాల్లో వాటిని 740 కు పెంచారని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు.
ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ మాట్లాడుతూ తాను బొజ్జి రెడ్డి మంచి మిత్రులమని, ఒక రాజ్యాంగ బద్ద పదివిని బొజ్జి రెడ్డి ని వరించడం సంతోషకరమైన విషయమన్నారు. షెడ్యూల్డ్ కులాల మరియు తెగల పరిరక్షణ, హక్కుల కోసం తాము ఎన్నో పోరాటాలు చేశామని, ఎస్సీ కమిషన్ మరియు ఎస్టీ కమిషన్ సమన్వయంతో వ్యవహరిస్తేనే ఆయా కులాలు మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు.
శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సోళ్ల బొజ్జి రెడ్డి కి మరియు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. షెడ్యూల్డ్ తెగల పరిరక్షణకు సోళ్ల బొజ్జి రెడ్డి నిరంతరం శ్రమిస్తూ ఉంటారని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సరైన వ్యక్తికి సరైన భాద్యతలు అప్పగించారన్నారు.
శాసనసభ సభ్యులు మిరియాల శిరీష మాట్లాడుతూ తామందరం ఇప్పటివరకు కూడా ఆదివాసీల అభివృద్ధి కోసం మాత్రమే కృషి చేస్తున్నామని ఇకపైన కూడా ఎస్టీ కమిషన్ సహాయ సహకారాలతో ఏజెన్సీ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేలా కార్యకమాలను చేపడతామని తెలిపారు. నూతన చైర్మన్ బాధ్యతలు చేపట్టిన బొజ్జి రెడ్డికి మరియు కమిషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేసారు.
కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ సెక్రటరీ చిన్నరాములు, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సదా భార్గవి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
