అండర్–19 ఫైనల్లో సూర్యవంశీ తుఫాన్ శతకం.. భారీ స్కోరు దిశగా భారత్..!
అండర్–19 ఫైనల్లో సూర్యవంశీ తుఫాన్ శతకం.. భారీ స్కోరు దిశగా భారత్..!
హరారే – 06 ఫిబ్రవరి 2026 – పీపుల్స్ మోటివేషన్
అండర్–19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత యువ జట్టు పరుగుల వరద సృష్టిస్తోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తుది పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ఫామ్లో చెలరేగుతూ కేవలం 55 బంతుల్లోనే శతకం సాధించి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఇన్నింగ్స్ ఆరంభంలో 20 పరుగుల వద్ద ఓపెనర్ ఆరోన్ జార్జ్ వికెట్ను కోల్పోయిన భారత్ కాస్త తడబడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఇంగ్లండ్ బౌలర్లపై దూకుడుగా ఆడిన ఈ జోడీ రెండో వికెట్కు 142 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కెప్టెన్ ఆయుష్ 53 పరుగులతో ఔటైనా.. మరోవైపు వైభవ్ మాత్రం పరుగుల వరద పారించాడు.
బౌండరీల మోత మోగిస్తూ మైదానం నలువైపులా షాట్లు సంధించిన వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి బౌలర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. ఆరు ఓవర్ల పవర్ప్లే నుంచే వేగం పెంచిన అతడు స్ట్రైక్ రేట్ దాదాపు 190కి చేరేలా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అలెక్స్ గ్రీన్ రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ.. మిగతా బౌలర్లు వైభవ్ ధాటికి తట్టుకోలేకపోయారు.
తాజా సమాచారం ప్రకారం 22 ఓవర్లలో భారత్ రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ సెంచరీ దాటిన తర్వాత కూడా దూకుడును కొనసాగిస్తూ భారీ స్కోరు దిశగా జట్టును తీసుకెళ్తున్నాడు. ఇంకా చాలా ఓవర్లు మిగిలి ఉండటంతో భారత్ మూడువందల యాభై పరుగులకు పైగా స్కోరు సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది
