భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ–పోలీసు సమన్వయం
భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ–పోలీసు సమన్వయం
- - పోలీస్ స్టేషన్ వారిగా కేసుల సమీక్ష
- - తప్పుడు కేసులకు అండగా నిలిచేవారిపై కఠిన చర్యలు
- - పారదర్శకంగా, వేగంగా పరిష్కారానికి ఆదేశాలు
శ్రీకాకుళం, ఫిబ్రవరి 6 (పీపుల్స్ మోటివేషన్):
శ్రీకాకుళం జిల్లాలో భూ వివాదాలకు సంబంధించిన కేసులను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు రెవెన్యూ మరియు పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్ వారిగా భూ వివాద కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అధికార దుర్వినియోగానికి తావు లేకుండా ప్రతి కేసును చట్టబద్ధంగా పరిశీలించాలని, ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. భూ వివాదాల కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, తప్పుడు కేసులకు అండగా నిలిచేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బైండ్ ఓవర్ కేసుల్లో కూడా ఎలాంటి అలసత్వం చూపకుండా చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
ఈ రెవెన్యూ సదస్సులో జిల్లా ఎస్పీతో పాటు డీఆర్ఓ, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొని భూ వివాదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

