23వ బయో ఏషియా 2026 సదస్సుకు శ్రీకారం
23వ బయో ఏషియా 2026 సదస్సుకు శ్రీకారం
- ఈ నెల 17, 18న హైదరాబాద్లో అంతర్జాతీయ మహాసభ
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (పీపుల్స్ మోటివేషన్): తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక 23వ బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో ఈ నెల 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. జీవశాస్త్ర రంగంలో సాంకేతిక విప్లవానికి వేదికగా నిలిచే ఈ మహాసభకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.
‘టెక్ బయో అన్లీష్డ్ – కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో విప్లవాత్మక పరిణామాలు’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో లైఫ్ సైన్సెస్ రంగంలో భవిష్యత్ ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుగుతాయి. టెక్ బయో ఆవిష్కరణల్లో దేశం ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో ఈ సదస్సు కీలకంగా మారింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏర్పాటు చేసే అంతర్జాతీయ ప్రదర్శనను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. రెండు రోజుల పాటు జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తలు, జీవశాస్త్ర రంగ నిపుణులు వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు.
పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో అమెరికాకు చెందిన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వైద్య విద్యా విభాగ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్, ఆమ్జెన్ సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హోవర్డ్ వై చాంగ్ కీలకోపన్యాసాలు చేయనున్నారు. విజ్ఞానం, సాఫ్ట్వేర్ సరఫరా, తదుపరి తరం బయోలాజిక్స్, ఔషధ పరిశ్రమ, బయోటెక్నాలజీ భవిష్యత్తు, కృత్రిమ మేధస్సు, పరిశోధనాభివృద్ధి, గ్లోబల్ ప్రభావం, తెలంగాణ రైజింగ్ 2047 – ప్రపంచ స్థాయి జీవశాస్త్ర వాతావరణ నిర్మాణం వంటి అంశాలపై చర్చలు సాగనున్నాయి.
