రహదారి భద్రతపై అవగాహన
రహదారి భద్రతపై అవగాహన
- మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపు
- అదనపు ఎస్పీ కె.వి. రమణ
శ్రీకాకుళం, ఫిబ్రవరి 16 (పీపుల్స్ మోటివేషన్): శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రత మరియు మత్తు పదార్థాల నియంత్రణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో “రహదారి భద్రత నియమాలు పాటించండి – మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి” అనే సందేశంతో రూపొందించిన పోస్టర్ను అదనపు ఎస్పీ కె.వి. రమణ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడడం వల్ల వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత కీలకమని పేర్కొన్నారు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించడం, హెల్మెట్ లేదా సీట్బెల్ట్ ధరించడం, అధిక వేగాన్ని నివారించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మద్యం సేవించి వాహనం నడపడం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో డ్రైవింగ్ చేయడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రజా ప్రదేశాల్లో పోస్టర్లు అతికించి అవగాహన పెంచుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వి. రామారావు, జిల్లా విభాగ సబ్ ఇన్స్పెక్టర్ సురేష్, సామాజిక కార్యకర్త వంగపండు రవికుమార్ పాల్గొన్నారు.
