జగన్ పర్యటనలకు పోలీసుల అనుమతుల్లేవు..
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
జగన్ పర్యటనలకు పోలీసుల అనుమతుల్లేవు..
- హోంమంత్రి అనిత హెచ్చరిక
- అనుమతులు లేకుండా జిల్లాల పర్యటనలు
- ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?
- జోగి రమేష్పై కేసు నమోదు
అమరావతి, ఫిబ్రవరి 7, 2026 (పీపుల్స్ మోటివేషన్): వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించేటప్పుడు పోలీసుల అనుమతి తీసుకోవడం లేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. జగన్ వివిధ జిల్లాల్లో పర్యటించే సమయంలో పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు. ఈ విధంగా అనుమతులు లేకుండా పర్యటనలు చేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. కనీస విచక్షణ లేకుండా ఇష్టానుసారం పర్యటిస్తానంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హోంమంత్రి హెచ్చరించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ప్రతి రాజకీయ పర్యటనకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా, మాజీ మంత్రి జోగి రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్ రవి వర్మ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలో జన సమీకరణ చేయవద్దని పోలీసులు జోగి రమేష్కు ముందుగానే నోటీసులు జారీ చేసినప్పటికీ, వాటిని ఉల్లంఘించి భారీ జన సమీకరణతో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారని ఆరోపించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంతో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
