ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదలే లక్ష్యం: నారా లోకేశ్
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదలే లక్ష్యం: నారా లోకేశ్
- స్టార్ రేటింగ్తో పాఠశాలల సమీక్ష
- రూ.7,500 కోట్ల అవసరం గుర్తింపు
- నాడు-నేడు బకాయిలుగా రూ.500 కోట్లు చెల్లింపు
అమరావతి, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమని విద్య, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ 2020 నుంచి 2026 వరకు ఆర్థిక సంవత్సరాల వారీగా మనబడి నాడు-నేడు, మనబడి-మన భవిష్యత్ పథకాల కింద ఖర్చు చేసిన నిధుల వివరాలను వెల్లడించారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం సుమారు రూ.7,500 కోట్ల అవసరం ఉందని అధికారులు తెలియజేశారని మంత్రి చెప్పారు. ప్రతి పాఠశాలకు 18 అంశాల ఆధారంగా స్టార్ రేటింగ్ ఇవ్వాలని తాను సూచించానని తెలిపారు. దాదాపు 40 శాతం పాఠశాలలు 2 స్టార్ కంటే తక్కువ రేటింగ్లో ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. లీక్ ప్రూఫ్ భవనాలు, బెంచీలు, పెయింటింగ్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలపై ముందుగా దృష్టి సారిస్తున్నామని వివరించారు. జీవో 117కు ప్రత్యామ్నాయంగా మోడల్ ప్రాథమిక పాఠశాలల కింద తరగతికో ఉపాధ్యాయుడు విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. గతంలో కేవలం 3 శాతం పాఠశాలల్లోనే ఈ విధానం ఉండగా, ప్రస్తుతం 33 శాతానికి పెంచినట్లు చెప్పారు. కొన్ని పాఠశాలల్లో తరగతి గదుల అవసరం ఉన్న నేపథ్యంలో సమగ్ర సమీక్ష చేపడుతున్నామని పేర్కొన్నారు. గతంలో నాడు-నేడు కింద అభివృద్ధి చేసిన 233 పాఠశాలలు మూసివేయబడ్డాయని, నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలని అన్నారు.
కూటమి ప్రభుత్వం నాడు-నేడు కింద పెండింగ్గా ఉన్న రూ.500 కోట్ల బిల్లులు చెల్లించినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో చిత్తశుద్ధి ఉంటే బిల్లులు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. అభ్యాస ఫలితాల పరంగా 2019 నుంచి 2024 వరకు వెనుకబడ్డామని, మూడో తరగతి 84.3 శాతం, ఐదో తరగతి 62.5 శాతం, ఎనిమిదో తరగతి 47 శాతం విద్యార్థులు రెండో తరగతి పాఠ్యపుస్తకాలు చదవలేకపోయినట్లు గణాంకాలు సూచిస్తున్నాయని వెల్లడించారు. అందుకే హామీతో కూడిన ప్రాథమిక అక్షరాస్యతపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడే స్థాయికి తీసుకువస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Comments
