జీవో వంద పదిహేడు రద్దుతో ప్రభుత్వ పాఠశాలలకు ఊతం
జీవో వంద పదిహేడు రద్దుతో ప్రభుత్వ పాఠశాలలకు ఊతం
- వన్ క్లాస్ – వన్ టీచర్ విధానం విస్తరణ
- మౌలిక సదుపాయాలకు వెయ్యి కోట్ల ప్రణాళిక
- నాడు–నేడు అక్రమాలపై చర్యల సూచన
- మంత్రి నారా లోకేశ్
అమరావతి, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్): గత ప్రభుత్వం రెండు వేల పందొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జీవో వంద పదిహేడు తీసుకురావడంతో పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ జీవోను రద్దు చేశామని రాష్ట్ర విద్య, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, గత ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం చేపట్టినప్పటికీ రెండు వందల ముప్పై మూడు పాఠశాలలు మూసివేయబడినట్లు వెల్లడించారు. పాఠశాల విద్యాభివృద్ధిలో వన్ క్లాస్ – వన్ టీచర్ విధానం కీలకమని మంత్రి పేర్కొన్నారు. గతంలో కేవలం మూడు శాతం పాఠశాలల్లో మాత్రమే ఈ విధానం అమల్లో ఉండగా, ప్రస్తుతం ముప్పై మూడు శాతానికి పెంచినట్లు తెలిపారు. దీని ద్వారా విద్యార్థులకు మెరుగైన బోధన అందుతూ పరీక్షా ఫలితాలు మెరుగుపడతాయని అన్నారు. మౌలిక సదుపాయాల పరంగా లీక్ ప్రూఫ్ భవనాలు, రంగు పూసిన తరగతి గదులు, బెంచీలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి ఐదు ప్రధాన అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నామని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ విధానం ప్రవేశపెట్టామని, ప్రస్తుతం ఐదు నక్షత్రాల రేటింగ్ ఉన్న పాఠశాలలు లేవని వెల్లడించారు. నలభై శాతం పాఠశాలలు ఒకటి, రెండు నక్షత్రాల స్థాయిలో ఉన్నాయని, అన్ని పాఠశాలలను మూడు, నాలుగు నక్షత్రాల స్థాయికి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. ఎస్ ఎం సి ఖాతాల్లో రెండు వందల కోట్ల రూపాయలు ఉండగా, బడ్జెట్లో అదనంగా ఎనిమిది వందల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ మొత్తంతో వచ్చే ఏడాది వెయ్యి కోట్ల రూపాయలను మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించే అవకాశం ఉందన్నారు. ఇక ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ గత ప్రభుత్వం పాఠశాలల విషయంలో అస్తవ్యస్త విధానాలు అనుసరించిందని ఆరోపించారు. నాడు–నేడు పేరుతో అక్రమాలు జరిగాయని, అనేక చోట్ల భవనాలు, మరుగుదొడ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టి, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. మనబడి – మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా పాఠశాలలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతూ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చెప్పారు. అసంపూర్తిగా నిలిచిన భవనాలు, తరగతి గదులను తక్షణమే పూర్తిచేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారని వెల్లడించారు.
