బీఆర్ఎస్ నేతలపై దాడిని ఖండించిన కేటీఆర్
బీఆర్ఎస్ నేతలపై దాడిని ఖండించిన కేటీఆర్
మంచిర్యాలలో చైర్మన్ ఎన్నికల వాయిదాపై ఆగ్రహం
పోలీసుల లాఠీచార్జీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శ
కాంగ్రెస్ అరాచకాలకు ప్రజల్లో గుణపాఠం తప్పదని హెచ్చరిక
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్): బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు పార్టీ నాయకులపై జరిగిన రాళ్ల దాడిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ గుండాల దాడి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నప్పటికీ, చైర్మన్ ఎన్నికల్లో కౌన్సిలర్లు పాల్గొనకుండా అడ్డుకొని వాయిదా వేయడం దుర్మార్గ చర్య అని విమర్శించారు. కొంతమంది పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, అన్యాయాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపైనే లాఠీచార్జీ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కేటీఆర్ ఆరోపించారు. న్యాయం కోసం నిరసన తెలిపిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్లపై కేసులు నమోదు చేస్తామని బెదిరించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం అని అన్నారు.
జనగామలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతూ చేయి ఎత్తిన దళిత మహిళా కౌన్సిలర్ పట్ల కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో అధికార కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అరాచక పాలన సాగిస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ఈ విధానాలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
