భారత్తో మ్యాచ్లో మా తురుపుముక్క అతడే: పాక్ కెప్టెన్
భారత్తో మ్యాచ్లో మా తురుపుముక్క అతడే: పాక్ కెప్టెన్
కొలంబో – ఫిబ్రవరి 14 – పీపుల్స్ మోటివేషన్
టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం భారత్తో జరగనున్న కీలక పోరుకు ముందు పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్తో మ్యాచ్లో స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ తమ జట్టుకు తురుపుముక్క అని పేర్కొన్నారు. అతని బౌలింగ్పై జరుగుతున్న విమర్శలను ఆయన ఖండించారు.
మీడియాతో మాట్లాడుతూ ఉస్మాన్ తారిఖ్ తమకు కీలక బౌలర్ అని, అతని బౌలింగ్ యాక్షన్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇప్పటికే రెండుసార్లు అనుమతించినప్పటికీ అనవసరంగా చర్చ జరుగుతోందని తెలిపారు. ఈ విమర్శలను ఉస్మాన్ పట్టించుకోవడం లేదని, మ్యాచ్లో అతను జట్టుకు కీలక పాత్ర పోషిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ఫామ్పై స్పందిస్తూ, అతని ప్రదర్శన తమకు ఎలాంటి ఆందోళన కలిగించడం లేదని స్పష్టం చేశారు. రాబోయే మ్యాచ్లో బాబర్ మంచి పరుగులు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచకప్లలో భారత్పై తమ రికార్డు ఆశించిన స్థాయిలో లేదని సల్మాన్ అంగీకరించారు. గతాన్ని మార్చలేమని, అయితే ఈసారి మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే ఈ మ్యాచ్పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
