బ్యాంకింగ్ నిబంధనల్లో భారీ మార్పులు…
బ్యాంకింగ్ నిబంధనల్లో భారీ మార్పులు…
- కొత్త ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ
ముంబై – ఫిబ్రవరి 13 – పీపుల్స్ మోటివేషన్
బ్యాంకింగ్ రంగంలో వినియోగదారుల హక్కులను పరిరక్షించే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డులు, బీమా పాలసీల విక్రయ విధానాలపై కఠిన నిబంధనలు జారీ చేసింది. జూలై 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి.
సింగిల్ క్లిక్ విక్రయాలకు ముగింపు
బ్యాంకులు రుణాలు లేదా ఖాతాలు తెరవడం సందర్భంగా కస్టమర్లకు తెలియకుండా బీమా, క్రెడిట్ కార్డులను జతచేసే విధానంపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఇకపై కస్టమర్ల స్పష్టమైన, విడి ఆమోదం లేకుండా ఏ ఉత్పత్తినీ విక్రయించరాదు. ఒకే క్లిక్తో బహుళ సేవలను అంగీకరించే విధానాన్ని నిషేధించింది.
కస్టమర్ అనుమతి తప్పనిసరి
ఆన్లైన్లో ‘అంగీకరిస్తున్నాను’ అనే బటన్ నొక్కగానే అనేక సేవలు ఆటోమేటిక్గా అమలయ్యే పరిస్థితిని ఆర్బీఐ అనుచితంగా పేర్కొంది. ప్రతి ఉత్పత్తికి ప్రత్యేకంగా, స్పష్టంగా కస్టమర్ సమ్మతి తీసుకోవాలని ఆదేశించింది. ఉత్పత్తి వివరాలు పూర్తిగా తెలియజేయడం బ్యాంకుల బాధ్యతగా పేర్కొంది.
అవసరాలకు సరిపోతేనే విక్రయం
కస్టమర్ ఆర్థిక స్థితి, ఆదాయానికి అనుగుణంగా ఉత్పత్తులు ఉండాలనే నిబంధనను కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. పరిమిత ఆదాయం ఉన్నవారికి అధిక ప్రీమియం లేదా అధిక ఛార్జీల ఉత్పత్తులు విక్రయిస్తే అది తప్పుదారి పట్టించడం కింద పరిగణిస్తామని హెచ్చరించింది. ఉత్పత్తి బ్యాంక్దా లేక వేరే సంస్థదా అన్నది ముందుగానే తెలియజేయాలి.
డిజిటల్ మాయాజాలాలకు చెక్
‘డార్క్ ప్యాటర్న్స్’గా పిలువబడే డిజిటల్ వ్యూహాలను ఆర్బీఐ నిషేధించింది. ముందే టిక్ చేసిన సమ్మతి పెట్టెలు, “ఇవాళే చివరి అవకాశం” వంటి ఒత్తిడి సృష్టించే ప్రకటనలు ఇక అనుమతించబడవు. వినియోగదారులపై మానసిక ఒత్తిడి తెచ్చే విధానాలు పూర్తిగా ఆపాలని బ్యాంకులకు సూచించింది.
ఈ కొత్త నిబంధనలతో బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత పెరుగుతుందని, వినియోగదారుల హక్కులు మరింత బలపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
