వాయిదా తీర్మానం తిరస్కరణతో వైఎస్సార్సీపీ ఆందోళన
వాయిదా తీర్మానం తిరస్కరణతో వైఎస్సార్సీపీ ఆందోళన
- ఆధారాలు ఉన్నాయన్న బొత్స సత్యనారాయణ
- సభ వరుసగా వాయిదా
అమరావతి, 19 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్): ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా జరిగిందన్న ఆరోపణలపై శాసనమండలి వరుసగా మూడోరోజూ దద్దరిల్లింది. ఈ అంశంపై సభలో చర్చించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు దాన్ని తిరస్కరించారు. సభ ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, వరుదు కల్యాణి, మొండితోక అరుణ్ కుమార్ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. బడ్జెట్పై నాలుగు రోజుల చర్చకు బీఎసీలో నిర్ణయం తీసుకున్నప్పటికీ, గత రెండు రోజులుగా బడ్జెట్ చర్చకు అవకాశం రాలేదని వైఎస్సార్సీపీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని, పోడియంను చుట్టుముట్టి విజిల్స్ వేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ, ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని పదేపదే స్పష్టం చేసినప్పటికీ, అదే అంశాన్ని పట్టుకుని సభా సమయాన్ని వృథా చేయడం సరికాదన్నారు.
హెరిటేజ్ సంస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయడానికే ఈ ఆందోళనలని మంత్రి ఆరోపించారు. చీజ్ ప్యాకెట్ను నెయ్యిగా చూపిస్తూ తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. హెరిటేజ్ సంస్థ ఇప్పటికే బొత్స సత్యనారాయణకు లీగల్ నోటీసులు పంపిందని, వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందాపూర్ సంస్థతో సంబంధం ఉందని చెబితే ఆధారాలు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఇదిలా ఉండగా, మండలి వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్కు సంబంధం ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. హెరిటేజ్ వెబ్సైట్లోనే ఇందాపూర్ అనుబంధమని పేర్కొన్నట్లు అన్నారు. తాను చూపించిన నెయ్యి ప్యాకెట్పై ఇందాపూర్ ద్వారా తయారీ వివరాలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ సభ్యుల నిరసనల మధ్య సభను మొదట కాసేపు, అనంతరం మరోసారి వాయిదా వేసి రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. దీంతో కీలకమైన ప్రశ్నోత్తరాలు, బడ్జెట్ చర్చలు జరగకుండానే శాసనమండలి వరుసగా రెండోరోజు వాయిదా పడింది.
