కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష
కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష
- భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ఏర్పాట్లు
- సౌకర్యాలే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం: మంత్రి గొట్టిపాటి రవికుమార్
పల్నాడు, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):
పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఈ నెల 15న జరగనున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సహచర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తిరునాళ్లకు తరలివచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి సరఫరా, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రత్యేకించి కొండ ప్రాంతంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు ట్రాఫిక్ ప్రణాళికను కట్టుదిట్టంగా అమలు చేయాలని, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని స్పష్టం చేస్తూ, తిరునాళ్లను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు.

