మనమిత్ర హాయ్ గా ఉంది
మనమిత్ర హాయ్ గా ఉంది
• అరకోటికి పెరిగిన యూజర్లు
• 2.50 కోట్లకుపైగా సేవలు (లావాదేవీలు) అందుకున్న యూజర్లు
• వాట్సప్ గవర్నెన్స్ కు గణనీయంగా పెరుగుతున్న ఆదరణ
• ఉన్న చోటు నుంచే క్షణాల్లో పనులు పూర్తి
• బిల్లుల చెల్లింపుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాల డౌన్లోడు వరకు
• అన్నీ మొబైల్ ఫోనులోనే పూర్తి చేసుకునే సదుపాయం
• రాష్ట్రం బయట ఉన్న ఏపీ వారూ ఉపయోగించుకుంటున్న తీరు
• ప్రతి ఇంటి చిరునామాగా మారిన మనమిత్ర నెంబరు 9552300009
ఏలూరుకు చెందిన ఎం. కిశోర్ బెంగళూరులో ఛార్టెర్డ్ అకౌంటెంటుగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన ఏలూరులోని తన సొంత ఆస్తికి సంబంధించి పన్నులు చెల్లించాలన్నా పనులు మానుకుని ఇక్కడికి రావాల్సి వచ్చేది. ఒకటి రెండు రోజులు ఇక్కడ ఉన్న కార్యాలయాల చుట్టూ తిరగడానికే పని సరిపోయేది. ఇప్పుడు ఆయనకు ఆ ఇబ్బంది లేదు. తన మొబైల్ ఫోనులోనే తాను చెల్లించాల్సిన పన్నులు పూర్తి చేసుకుంటున్నారు. మరిన్ని సేవలు పొందుతున్నారు.
పల్నాడు జిల్లా నాదేండ్లకు చెందిన సరళది ఇదే తరహా అనుభవం. ఆమె హైదరాబాద్లో పనిచేస్తోంది. గతంలో ఆమె పన్నులు కట్టాలన్నా, రెవెన్యూ సేవలు పొందాలన్నా పనులు మానేసుకుని హైదరాబాద్ నుంచి ఇంటికి రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆమెకు ఆ అవసరం కనిపించడం లేదు. హైదరాబాద్ నుంచే తన మొబైల్ ఫోనులో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా బిల్లలు చెల్లింపు మొదలు, దరఖాస్తు చేసుకోవడం వరకు అన్ని సేవలు పొందుతోంది. ఇటీవలే శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి టికెట్లు బుక్ చేసుకుంది.
అనకాపల్లి మండలం మామిడిపాలెంకు చెందిన సురేష్ ఒక ప్రవైటు కంపెనీలో మేనేజరుగా పనిచేస్తున్నారు. ఉదయం ఆఫీసుకు వెళ్లి ఇంటికి రావాలంటే రాత్రి 8 గంటలవుతుంది. సర్టిఫికెట్ కావాలన్నా, పన్నులు చెల్లించాలన్నా ప్రత్యేకించి సెలవు పెట్టుకుని సచివాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఆయనకు ఇప్పుడా అవరం కనిపించడం లేదు. తన మొబైల్ ఫోనులోని మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే తనకు కావాల్సిన ఓబీసీ సర్టిఫికెట్ కోసం హాయిగా దరఖాస్తు చేసుకున్నారు.
మనమిత్రతో హాయ్ గా సేవలు పొందుతున్న లక్షలాది మంది పౌరుల్లో వీరు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రభుత్వ కార్యాలయాలకు ఏమాత్రం వెళ్లాల్సిన పనిలేకుండా తామున్న చోటు నుంచే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పుడు ఏపీలో లక్షలాది మంది ప్రజలు హాయిగా సేవులు పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను ఆనందంగా ఆస్వాధిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ కు ప్రజల ఆదారణ పెరుగుతోంది. ప్రజలు ఇప్పుడిప్పుడే ఈ సదుపాయం ఉపయోగాలేంటో అర్థం చేసుకుంటున్నారు. వాట్సాప్ ఉపయోగించడానికి మొగ్గు చూపుతున్నారు. మనమిత్ర ఉపయోగించేవారి సంఖ్య ప్రస్తుతం అరకోటి దాటింది. రాష్ట్రంలో ప్రజలెవ్వరూ కూడా తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్లాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి ఆశయం. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేస్తూ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమానికి రూపుకల్పన చేశారు. గత ఏడాది జనవరిలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఏడాది కాలంలో వాట్సాప్ గవర్నెన్స్ యూజర్ల సంఖ్య రోజురోజుకీ గణణీయంగా పెరుగుతూ ప్రజాదరణ చూరగొంటోంది.
వెయ్యికిపైగా సేవలు
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు దాదాపు వెయ్యికిపైగా సేవలు కల్పించనుంది. ప్రస్తుతం 900కుపైగా సేవలు మనమిత్ర ద్వారా అందుతున్నాయి. ఈ నెలలో ఈ సేవలు వెయ్యికి దాటనున్నాయి. ఆర్టీసీ బస్సు టికెట్ల రిజర్వేషన్లు మొదలు, మున్సిపాల్టీ, పంచాయతీల్లో ఆస్తిపన్ను, నీటి పన్నుల చెల్లింపులు, కరెంటు బిల్లుల చెల్లింపులు, రెవెన్యూ, పోలీసు, పింఛన్లు, రిజిస్ట్రేషన్ సేవలు, తల్లికి వందనం, సర్టిఫికెట్లు, ఓబీసీ, ఇన్కమ్, ప్రభుత్వం నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు, ఫలితాలు కూడా ఇందులోనే డౌన్ లోడు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే సదుపాయం ఇలా పలు రకాల సేవలను మనమిత్ర ద్వారా పౌరులకు అందిస్తోంది.
పట్టాదారు పాసుపుస్తకం పొందొచ్చు
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రెవెన్యూ సేవలు మరింత సులభతరం చేశారు. ప్రజలు తమ ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ తమ సెల్ఫోన్ లోని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. 1-బీ అడంగళ్ కాపీని ఇందులోనే డౌన్ లోడు చేసుకోవచ్చు. పట్టాదారుపాసుపుస్తకం ఈ-కాపీని కూడా ఇందులో డౌనులోడు చేసుకోవడంతో పాటు తమ ఆస్థులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. గతంలో ఈ పనుల కోసం ప్రజలు పనులు మానేసుకుని రెవెన్యూ కార్యాలయాలు, రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఈసీ (ఎన్క్యుంబరెన్సు సర్టిఫికెట్)కూడా ఇందులోంచి డౌను లోడు చేసుకోవచ్చు.
ఆలయాల సేవలన్నీ
తిరుమల శ్రీవారి ఆలయంలో వేంకటేశ్వరస్వామికి చేసే ఆర్జిత సేవల టికెట్లు, దర్శనాల టికెట్ల బుకింగ్ మొదలు, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, సింహాచలం, అన్నవరం, తదితర ప్రముఖ ఆలయాలతో పాటు దేవాదాయ శాఖ పరిధిలోని ప్రధాన ఆలయాల్లో సేవలకు సంబంధించి వాట్సాప్లో భక్తులు ముందుగానే నమోదు చేసుకోవచ్చు. అలాగే ఆయా ఆలయాలకు భక్తులు కానుకలను కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ-హుండీకి పంపొచ్చు.
9552300009 సేవ్ చేసుకోండి
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులందరూ సులభంగా సేవలు పొందడానికి వారి యాండ్రాయిడ్ మొబైల్ ఫోనులో 9552300009 నెంబరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. వాట్సాప్లో ఈ నెంబరుకు హాయ్ అని మెసేజే పంపితే చాలు, అందులో ప్రభుత్వం పౌరులకు అందిస్తున్న సేవలన్నీ కనిపిస్తాయి. పౌరులు తమకు ఎలాంటి సేవలు కావాలో అందులో తెలుసుకుని చాలా సులభంగా ఇట్టే క్షణాల్లో ఆ సేవలను పొందవచ్చు.
తెలుగులోనూ పనిచేస్తుంది
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఇంగ్లీషు, తెలుగు భాషల్లోనూ పనిచేస్తుంది. అందువల్ల పౌరులు దీన్ని ఉపయోగించడం ఎంతో తేలిక. పైగా సేవలు కూడా ఎంతో సులభంగా పనిచేస్తాయి.
వాయిస్ ద్వారా కూడా
వాట్సాప్లో టైపు చేయడం తెలీని వారు తమకు ఏం కావాలో వాయిస్ ద్వారా చెప్పడం ద్వారా కూడా ఆ సేవలు పొందవచ్చు. ఆ విధంగా పనిచేసేలా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ను ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు) ఆధారితంగా పనిచేస్తుంది.
50 లక్షలకు చేరిన యూజర్లు
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ను రాష్ట్రంలో వినియోగించేవారి సంఖ్య 50 లక్షలకు చేరుకుంది. వీరు పలుమార్లు ప్రభుత్వ సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందారు. ఈ ప్రకారం ఈ యూజర్ల అందుకున్న సేవలు, చేసిన లావాదేవీలు 2.50 కోట్లకుపైగా ఉన్నాయి. వీరంతా కూడా ఎలాంటి అంతరాయాలు లేకుండా క్షణాల్లో సేవలను వాట్సాప్ గవర్నెన్సప్ ద్వారా పొందారు.
