ఇంట్లోని పెద్దలకు ఇవి చెప్పారా?
ఇంట్లోని పెద్దలకు ఇవి చెప్పారా?
- సైబర్ మోసాలపై తెలంగాణ పోలీసుల హెచ్చరిక
- ఆన్లైన్ మోసాలే లక్ష్యంగా వృద్ధులు
- డిజిటల్ అరెస్ట్, ఫేక్ జాబ్లతో మోసాలు
- అవగాహనతోనే మోసాలకు చెక్
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (పీపుల్స్ మోటివేషన్): ఆన్లైన్ మోసగాళ్లు ఎక్కువగా ఇంట్లోని పెద్దలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలియని లింకులు, అనుమానాస్పద ఫోన్ కాల్స్, ఆఫర్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇంట్లోని పెద్దలకు ముందుగానే అవగాహన కల్పించాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సైబర్ మోసాలపై ఇంట్లో చర్చించి, ఎలాంటి సందేహాస్పద పరిస్థితుల్లోనూ వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తెలియని వ్యక్తులు పంపే లింకులు క్లిక్ చేయవద్దని, అనవసరంగా వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టడం, ఫేక్ జాబ్ ఆఫర్లు, పార్సిల్ లేదా కూరియర్ పేరుతో ఫోన్ కాల్స్, ఓటీపీలు అడగడం వంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. వృద్ధులు ఎలాంటి భయానికి లోనుకాకుండా, ప్రశాంతంగా వ్యవహరించి ముందుగా కుటుంబ సభ్యులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. సైబర్ మోసాలను నివారించడంలో అవగాహననే ప్రధాన ఆయుధమని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. ఇంట్లోని పెద్దలతో ఈ విషయాలను తప్పకుండా పంచుకోవాలని, అవసరమైతే వారికి స్మార్ట్ఫోన్ వినియోగంపై కూడా మార్గనిర్దేశం చేయాలని కోరారు. అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
