అన్నం పెట్టినోళ్లకు ఓటేద్దామా.. సున్నం పూసినోళ్లకు ఓటేద్దామా..
అన్నం పెట్టినోళ్లకు ఓటేద్దామా.. సున్నం పూసినోళ్లకు ఓటేద్దామా..
- సదాశివపేట ఓటర్లతో హరీశ్రావు
- కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు
- కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి గుర్తుచేసిన హరీశ్రావు
సదాశివపేట – 08 ఫిబ్రవరి – పీపుల్స్ మోటివేషన్
మెదక్ జిల్లా సదాశివపేటలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “అన్నం పెట్టినోళ్లకు ఓటేద్దామా.. సున్నం పూసినోళ్లకు ఓటేద్దామా?” అంటూ ప్రజలను ప్రశ్నించారు. రెండున్నరేళ్ల పాలనలో రేవంత్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీలేదని విమర్శించారు.
భార్యకు బస్సు ఫ్రీ ఇచ్చి, భర్తకు డబుల్ టికెట్ ఇచ్చినట్టుగా ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రూ.4 వేల పెన్షన్లు ఇవ్వలేదని, ఒక్కొక్కరికీ రూ.52 వేల వరకు బకాయిలు ఉన్నాయని ఆరోపించారు. “అవ్వాతాతలు మీకు రావాల్సిన బకాయి రూ.52 వేలు అడగండి” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ హయాంలో సదాశివపేట, సంగారెడ్డిలో ఆస్పత్రులు, కొత్త బస్టాండ్, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అభివృద్ధి పనులు జరిగాయని గుర్తుచేశారు. బిడ్డ పుడితే కేసీఆర్ కిట్ ద్వారా ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మీ కింద ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక మద్దతు ఇచ్చామని తెలిపారు. రేవంత్ రెడ్డి “తులం బంగారం ఇస్తా” అన్న మాట అమలు చేశారా? ఒక్కరికైనా అందిందా? అని ప్రశ్నించారు.
గొర్రె పిల్లల పథకం, చేప పిల్లల పథకం, కేసీఆర్ కిట్, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు. మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చి బస్తీ దవాఖానాలు, వీధిలైట్లు, రోడ్లు, పార్కులు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి ఓట్లేసి గోస పడాలా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సదాశివపేటకు స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని హరీశ్రావు హామీ ఇచ్చారు. చెత్త మాటలు వద్దు.. అభివృద్ధి కావాలంటూ ఓటుతోనే సమాధానం చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ గెలిపించాలని, ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.
